Vakiti Srihari: నా జీవితం ప్రజలకే అంకితం..
ABN , Publish Date - Jun 15 , 2025 | 03:31 AM
తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మంత్రిగా అవకాశమిచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్లకు రుణపడి ఉంటా
మంత్రి వాకిటి శ్రీహరి
గాంధీభవన్లో మహేశ్తో మర్యాదపూర్వక భేటీ
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంత్రిగా అవకాశమిచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్లకు జీవితాంతం రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. అలాగే మక్తల్ నియోజకవర్గ ప్రజలకు.. మంత్రి కావడానికి సహకరించిన మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. శనివారం తొలిసారి గాంధీభవన్ను సందర్శించి మహేశ్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్కు సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు చెందిన శ్రీహరి మంత్రి పదవికి అన్ని రకాలుగా అర్హుడన్నారు. ఆయనకు మంత్రి పదవి లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీలోనూ.. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు సామాజిక న్యాయానికి ప్రాధాన్యత కల్పిస్తామని పునరుద్ఘాటించారు.
సీఎం చిత్రపటానికి దివ్యాంగుల పాలాభిషేకం..
దివ్యాంగులు దివ్యాంగులనే పెళ్లి చేసుకున్నా రూ.లక్ష ప్రోత్సాహకం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిపారు. గాంధీభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.