Share News

Pushkaralu: కాళేశ్వరంలో భక్తుల అరిగోస

ABN , Publish Date - May 26 , 2025 | 03:41 AM

త్రివేణి సంగమమైన కాళేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడంతో సరస్వతీ పుష్కరాల 11వ రోజున ఘాట్లతో పాటు కాళేశ్వరం వీధులు జనమయమయ్యాయి.

Pushkaralu: కాళేశ్వరంలో భక్తుల అరిగోస

  • పుష్కరాల 11వ రోజున 3.50 లక్షల మంది రాక

  • 15 కి.మీ. మేర స్తంభించిన ట్రాఫిక్‌

  • నియంత్రణలో అధికారుల వైఫల్యం

  • శివయ్య దర్శనం కోసం భక్తుల పడిగాపులు

  • మంచినీరు, నిలువ నీడ లేక ఇక్కట్లు

  • అధికారుల వైఫల్యంపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం

  • పుణ్యస్నానం ఆచరించిన గవర్నర్‌ దంపతులు

భూపాలపల్లి, మే 25(ఆంధ్రజ్యోతి): త్రివేణి సంగమమైన కాళేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఊహించని రీతిలో భక్తులు పోటెత్తడంతో సరస్వతీ పుష్కరాల 11వ రోజున ఘాట్లతో పాటు కాళేశ్వరం వీధులు జనమయమయ్యాయి. ఆదివారం సుమారు 3.50 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే వరుసగా రెండో రోజు కూడా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తడంతో పుష్కరస్నానాల కోసం వచ్చిన భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. తాత్కాలిక బస్టాండ్‌ నుంచి పుష్కర ఘాట్లు, ముక్తీశ్వరాలయం వరకు అరిగోస పడ్డారు. వీఐపీల తాకిడి అధికం కావడంతో అధికార యంత్రాంగమంతా వారి సేవలో తరించడం, సామాన్య భక్తుల ఇక్కట్లను పట్టించుకునేవారు లేకపోవడంతో అంతా గందరగోళంగా మారింది. చాలామంది భక్తులు పుష్కర స్నానానికి పరిమితమై శివయ్యను దర్శించుకోకుండానే అసంతృప్తితో ఇంటి ముఖం పట్టారు. పుష్కరాల గడువు మరో 24 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఆదివారం భక్తుల సంఖ్య భారీగా ఉండవచ్చని అధికార యంత్రాంగం ముందుగానే అంచనా వేసినా తాగునీరు, నీడ వసతిని కూడా కల్పించలేకపోయింది.


ఉదయం నుంచి సాయంత్రం వరకు శివయ్య దర్శనం కోసం నిరీక్షించిన చాలామంది భక్తులు ఆకలితో వెనుదిరిగారు. అన్నప్రసాద వితరణలోనూ దేవాదాయ శాఖ విఫలమైందని భక్తులు మండిపడ్డారు. మరోవైపు.. మహదేవపూర్‌ నుంచి కాళేశ్వరం వరకు దాదాపు 15కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీనికి తోడు ప్రైవేటు వాహనాలను ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు, పుష్కర ఘాట్ల వరకు అనుమతించడం సమస్య తీవ్రతను మరింత పెంచింది. చాలామంది భక్తులు మహారాష్ట్ర వైపు పుణ్యస్నానాలు చేసి శివుడిని దర్శించుకోకుండానే తిరిగి వెళ్లిపోయారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో వీఐపీల సేవలో తరించిన అధికారులు.. సామాన్యులను పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీసింది. ట్రాఫిక్‌ నియంత్రణలో వైఫల్యంపై మంత్రి శ్రీధర్‌బాబు జిల్లా ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


గవర్నర్‌ దంపతుల పుష్కరసాన్నం

రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దంపతులు పుష్కర సాన్నమాచరించి సరస్వతీ మాతకు చీర, సారె సమర్పించారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. వారి వెంట మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఉన్నారు. ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎంపీ నామ్‌దేవ్‌రావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తన కుటుంబసభ్యులతో కలిసి పుష్కరస్నానాలు ఆచరించారు.


ఇవి కూడా చదవండి

Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్

ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం

Updated Date - May 26 , 2025 | 03:41 AM