Mahesh Kumar Goud: ఏం చేసినా.. కవితను బీసీలు నమ్మరు
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:44 AM
పదేళ్లు అధికారంలో ఉండి, ఏనాడూ బీసీల గురించి మాట్లాడని కవిత.. ఇప్పుడు బీసీల పట్ల ఎంత ప్రేమ ఒలకబోసినా ఎవరూ నమ్మరని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ అన్నారు.

కాంగ్రెస్తోనే సామాజిక న్యాయం సాధ్యం
టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్
హైదరాబాద్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పదేళ్లు అధికారంలో ఉండి, ఏనాడూ బీసీల గురించి మాట్లాడని కవిత.. ఇప్పుడు బీసీల పట్ల ఎంత ప్రేమ ఒలకబోసినా ఎవరూ నమ్మరని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లులను ఆమోదించడమే కాకుండా, వచ్చే స్థానిక ఎన్నికల్లోనే బీసీ రిజర్వేషన్ను అమలు చేసేందుకు ఆర్డినెన్స్ను రూపొందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఎవరెన్ని చెప్పినా కాంగ్రె్సతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రె్సతోనే సామాజిక న్యాయం సాధ్యమనడానికి టీపీసీసీ అధ్యక్షుడిగా తాను, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ఉండడమే ఉదాహరణ అని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే.. అప్పుడు మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కాగా, బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై కవితకు చిత్తశుద్ధి ఉంటే.. 72 గంటల దీక్షను గల్లీలో కాదు.. ఢిల్లీలో చేపట్టాలని ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య హితవు పలికారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై పోరాటం చేస్తామని తాము ప్రకటించగానే.. కవిత డ్రామాలకు సిద్ధమైందని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు కనిపించలేదా? అని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో గత పాలకులు కనీస ప్రయత్నం కూడా చేయలేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్గౌడ్ విమర్శించారు.