Mahesh Kumar Goud: పర్యావరణ పరిరక్షణే మానవాళికి రక్షణ: మహేశ్
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:52 AM
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవ్వాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.

హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవ్వాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణే మానవాళికి రక్షణ అని అభివర్ణించారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలి. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించేందుకు నిబద్ధతతో వ్యవహరించాలి.
ఈ పర్యావరణ దినోత్సవం కొత్త ఆలోచనలకు, హరిత జీవనశైలికి, చైతన్యానికి నాంది కావాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి.. మహేశ్ గౌడ్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.