Share News

Hyderabad: ‘పోవే పో.. రెండ్రోజుల్లో నీ పని పడతా’

ABN , Publish Date - May 29 , 2025 | 04:06 AM

నువ్వెవరే నాకు లెటర్‌ ఇవ్వడానికి.. పోవే పో.. నీ లెటర్‌ నాకు అక్కర్లేదు.. నిన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతా... రెండురోజుల్లో నీ పని చెప్తా.. పోవే.. పో’’..

Hyderabad: ‘పోవే పో.. రెండ్రోజుల్లో నీ పని పడతా’

  • జీహెచ్‌ఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్‌పై ఎమ్మెల్యే దానం అనుచరుడి వీరంగం

  • ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

బేగంపేట, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘‘నువ్వెవరే నాకు లెటర్‌ ఇవ్వడానికి.. పోవే పో.. నీ లెటర్‌ నాకు అక్కర్లేదు.. నిన్ను ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతా... రెండురోజుల్లో నీ పని చెప్తా.. పోవే.. పో’’.. మహిళ అని కూడా చూడకుండా జీహెచ్‌ఎంసీ డిప్యూటీ సిటీ ప్లానర్‌ను దూషిస్తూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనుచరుడు సుదీప్‌ పటేల్‌ చేసిన వ్యాఖ్యలివి. జీహెచ్‌ఎంసీ బేగంపేట సర్కిల్‌ కార్యాలయంలోని డిప్యూటీ కమిషనర్‌ చాంబర్‌లో ఆయన కళ్లఎదుటే సుదీ్‌పపటేల్‌ ఇలా వీరంగం సృష్టించాడు. ఈ నెల 21న జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా బయటికి వచ్చింది. హైదరాబాద్‌ ప్రకాశ్‌నగర్‌లోని వెల్కిన్‌ పార్క్‌ అపార్ట్‌మెంట్స్‌ ఎదురుగా ఉన్న ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీసీపీ సుస్మిత మే 17న ఆ ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. కానీ, కోర్టు స్టే ఆదేశాలు ఉన్నాయని తెలిసి కూల్చివేతలను విరమించుకున్నారు.


ఈ క్రమంలో 21న బేగంపేట సర్కిల్‌ కార్యాలయానికి వచ్చిన సుదీప్‌ పటేల్‌.. కూల్చివేతలు చేపట్టకపోవడంపై డిప్యూటీ కమిషనర్‌ను నిలదీశాడు. ఈ విషయమై సుస్మిత వివరణతో కూడిన లేఖను డీసీకి ఇచ్చేలోపు సుదీప్‌ పటేల్‌ రెచ్చిపోయాడు. డిప్యూటీ కమిషనర్‌ ఎదుటే ఆమెపై తీవ్ర దుర్బాషలాడాడు. దీంతో ఆస్పత్రిపాలైన సుస్మిత.. తనను దూషించిన సుదీప్‌ పటేల్‌పై చర్యలు తీసుకునేలా పోలీసులకు లేఖ రాయాలని డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ మేరకు నార్త్‌ జోన్‌ డీసీపీ రష్మీ పెరుమాళ్‌కు లేఖ రాసిన ఆయన.. సుదీప్‌ పటేల్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈనెల 23న బాధితురాలు సుస్మిత నుంచి ఫిర్యాదు తీసుకున్నవెస్ట్‌ మారేడ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సుస్మిత ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - May 30 , 2025 | 02:56 PM