ACB Arrest: 15 వేలు లంచం తీసుకుంటూచిక్కిన సర్వేయర్
ABN , Publish Date - Jun 01 , 2025 | 04:06 AM
భూ సర్వే పంచనామా ధ్రువీకరణ పత్రం జారీకి ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ల్యాండ్ సర్వేయర్ మల్లోజు నాగరాజును ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు.

సర్వేయర్ల శిక్షణ శిబిరంలోనే పట్టుకున్న అధికారులు
సిరిసిల్ల, మే 31(ఆంధ్రజ్యోతి): భూ సర్వే పంచనామా ధ్రువీకరణ పత్రం జారీకి ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ల్యాండ్ సర్వేయర్ మల్లోజు నాగరాజును ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. సిరిసిల్లలోని చంద్రంపేట రైతు వేదిక వద్ద నిర్వహించిన సర్వేయర్ల శిక్షణ శిబిరం వద్దే నాగరాజును పట్టుకోవడం గమనార్హం.
ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయంలో ల్యాండ్ సర్వేయర్గా ఉన్న మల్లోజు నాగరాజును.. అదే మండలంలోని వెంకటాపూర్కు చెందిన జక్కపురం మల్లేశం అనే రైతు తనకు చెందిన 6 గుంటల స్థలం హద్దులు నిర్ణయించి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరాడు. ఇందుకు నాగరాజు రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో సర్వేయర్ల శిక్షణ తరగతుల వద్ద మల్లేశం నుంచి నాగరాజు రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.