Hyderabad: తహసీల్దార్ కార్యాలయం ఎదుట చెడ్డీపై బాధితుడి నిరసన
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:06 AM
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ భూ బాధితుడు వినూత్న నిరసన చేపట్టాడు. తన ఒంటిపై ఉన్న షర్టు, ఫ్యాంటును విప్పేసి చెడ్డీపై కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కూర్చుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- కోర్టు ఆదేశాల మేరకు రికార్డులో పేరు ఎక్కించి పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్: అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయం(Abdullapurmet Tehsildar Office) ఎదుట ఓ భూ బాధితుడు వినూత్న నిరసన చేపట్టాడు. తన ఒంటిపై ఉన్న షర్టు, ఫ్యాంటును విప్పేసి చెడ్డీపై కార్యాలయం ప్రధాన గేటు ఎదుట కూర్చుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేటకు చెందిన శంకర్రెడ్డి 2000లో అబ్దుల్లాపూర్మెట్ మండలం తట్టిఅన్నారంలోని సర్వే నంబర్ 109,110లో 6 ఎకరాలను 99 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నాడు. అనంతరం 2002లో సదరు భూమిని కొనుగోలు చేసేందుకు పట్టాదారుల వద్ద అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య భూ వివాధం తలెత్తడంతో ఇరువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ద్వారా ఫీజు చెల్లించి 2016లో శంకర్రెడ్డి 6 ఎకరాలను రిజిస్ర్టేషన్ చేసుకున్నాడు.
దీంతో శంకర్రెడ్డి పేరుపై రెండు ఎకరాల భూమి రికార్డులో నమోదు అయి పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. మిగతా నాలుగు ఎకరాలకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉన్నది. అయితే అప్పటి నుంచి నాలుగు ఎకరాల భూమికి సంబంధించి పట్టాదారు పాసుబుక్ల కోసం శంకర్రెడ్డి కుమారుడు గంగిరెడ్డి గిరిధర్రెడ్డి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు.
కాగా 2022లో ఆమోద డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం శంకర్రెడ్డికి చెందిన 6ఎకరాల భూమిని తప్పుడు పత్రాలు సమర్పించి రికార్డులో శంకర్రెడ్డి పేరును తొలగించి ఆమోద డెవలపర్స్పై పేరును నమోదు చేయించి పట్టాదారు పాస్బుక్లను పొందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శంకర్రెడ్డి కుమారుడు గిరిధర్రెడ్డి తమకు ఎలాంటి నోటీసు, సమాచారం ఇవ్వకుండా రికార్డుల నుంచి తమ పేర్లు ఎలా తొలగిస్తారని అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
సదరు భూమిపై స్టేట్సకో ఉండగా రికార్డులో మార్పులు ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. అప్పటి కలెక్టర్, తహసీల్దార్ డబ్బులు తీసుకుని వారికి అనుకూలంగా రికార్డు మార్పులు చేశారని గిరిధర్రెడ్డి ఆరోపించారు. మూడు ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరగడం లేదని శుక్రవారం గిరిధర్రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బట్టలు విప్పి చెడ్డీపై కూర్చుని నిరసనకు దిగారు. కోర్టు ఆదేశాల మేరకు 6 ఎకరాలకు వెంటనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గిరిధర్రెడ్డిని పోలీ్సస్టేషన్కు తరలించారు.
ఆ భూమి కోర్టు పరిధిలో ఉన్నది: తహసీల్దార్
తట్టిఅన్నారంలోని సర్వే నంబర్ 109,110లోని భూమి కోర్టు పరిధిలో ఉన్నది. ప్రస్తుతం దానిపై స్టేటస్ కోఆర్డర్ ఉన్నది. కేసు కోర్టు పరిధిలో ఉండగా రికార్డులో పేరు మార్చి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలని గిరిధర్రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. వివాదం కోర్టు పరిధిలో ఉండడంతో పాసు పుస్తకాలు ఇవ్వడం కుదరదని గత నెల 21న గిరిధర్రెడ్డికి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు తహసీల్దార్ సుదర్శన్రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విశాఖ వందేభారత్కు ఇకపై 20 బోగీలు
నిరుద్యోగుల కష్టాలు కనబడట్లేదా...
Read Latest Telangana News and National News