Share News

KTR: ‘ఫార్ములా-ఈ’ కేసులో కేటీఆర్‌కు మళ్లీ నోటీసులు

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:52 AM

ఫార్ములా-ఈ కారు కేసు విచారణలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మరోసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నోటీసులు జారీ చేసింది.

KTR: ‘ఫార్ములా-ఈ’ కేసులో కేటీఆర్‌కు మళ్లీ నోటీసులు

  • 16న హాజరు కావాలన్న ఏసీబీ

  • కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని సూచన

  • చార్జిషీటు దాఖలుకు ఏసీబీ కసరత్తు

  • నోటీసుల పేరిట రేవంత్‌ నాటకాలు

  • దమ్ముంటే లైడిటెక్టర్‌కు నిలవాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కారు కేసు విచారణలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మరోసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని, కొన్ని డాక్యుమెంట్లను అందజేయాలని ఏసీబీ కోరినట్లు తెలిసింది. వాస్తవానికి ఈ కేసులో కేటీఆర్‌ను మరో సారి విచారణకు పిలవాలని నిర్ణయించిన ఏసీబీ అధికారులు.. గత నెలలోనే నోటీసు జారీ చేశారు. అయితే, ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం తాను అమెరికా వెళ్తున్నానని వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్‌ రాతపూర్వకంగా జవాబు ఇవ్వడంతో ఏసీబీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు.


హెచ్‌ఏండీఏ నుంచి యూకేలోని ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ సంస్ధకు రూ.55కోట్ల చెల్లింపు వ్యవహారంలో మాజీ పురపాలకశాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పలుమార్లు విచారించారు. ఇందులో దాదాపు రూ.46కోట్లను బ్రిటిష్‌ పౌండ్ల రూపంలో చెల్లించడం రిజర్వ్‌బ్యాంక్‌ ఇండియా మార్గదర్శకాలకు విరుద్ధమని, దీని వల్ల హెచ్‌ఏండీఏ రూ.8కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చిందని విచారణ అధికారులు గుర్తించారు. సచివాలయ బిజినెస్‌ నిబంధనల ఉల్లంఘనతోపాటు క్యాబినెట్‌ ఆమోదం లేకుండా నిధుల బదలాయింపు జరిగినట్లు తేల్చారు. తాజాగా కేటీఆర్‌ విచారణ తర్వాత ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Updated Date - Jun 14 , 2025 | 03:52 AM