Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ఫ్లో
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:29 AM
కృష్ణా నది వరద తగ్గుముఖం పట్టగా.. గోదావరికి మాత్రం కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమంగా తగ్గిపోయింది.

2 రోజుల్లో మూతపడనున్న గేట్లు!
551.10 అడుగులకు సాగర్ నీటిమట్టం
మేడిగడ్డకు కొనసాగుతున్న వరద
బ్యారేజీకి 2.89 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
నెలన్నరలో 256 టీఎంసీలు సముద్రం పాలు
గద్వాల/నాగార్జునసాగర్/మహదేవపూర్ రూరల్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నది వరద తగ్గుముఖం పట్టగా.. గోదావరికి మాత్రం కొనసాగుతోంది. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో క్రమంగా తగ్గిపోయింది. జలాశయానికి ఆదివారం 73,586 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వచ్చింది. ఒక గేటు ఎత్తి 27,296 కూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,382 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు రోజుల్లో గేట్లు మూసివేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 206.09 టీఎంసీల నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టుకు 65 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, ఒక గేటు ద్వారా 6,823 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,035 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నిలకడగా కొనసాగుతోంది.
దీంతో సాగర్ నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 551.10 అడుగులకు చేరుకుంది. సాగర్ నుంచి జంటనగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీ ద్వారా 1,650 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఆలమట్టి ప్రాజెక్టుకు కూడా ఇన్ఫ్లో 69,084 క్యూసెక్కులకు తగ్గింది. నారాయణపూర్ ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, అవుట్ఫ్లో 3 వేల క్యూసెక్కులే ఉంది. తుంగభద్రకు ఇన్ఫ్లో తగ్గిపోవడంతో 30,728 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం ఇన్ఫ్లో 2.89 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. నీటిమట్టం 4.20 మీటర్లు ఉంది. దీంతో కుంగిన ఏడో బ్లాక్లోని గేట్లతో పాటు మొత్తం 85 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.