Kishan Reddy: కాజీపేట ఆర్ఎంయూలో ‘మెము’ కోచ్ల ఉత్పత్తి
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:13 AM
కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)లో మెము(మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) కోచ్లను ఉత్పత్తి చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

వచ్చే ఏడాది మే నెల నుంచే ప్రారంభించేందుకు కృషి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)లో మెము(మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) కోచ్లను ఉత్పత్తి చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వచ్చే ఏడాది మే నెల నుంచే వీటి ఉత్పత్తిని ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం తనను కలిసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
16 నుంచి 20 కోచ్లు ఉండే మెము రైళ్లు గ్రామీణ ప్రాంతాలు, సెమీ-అర్బన్ ప్రాంతాలను అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించనున్నాయని, మరీ ముఖ్యంగా పండగల సమయంలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయని తెలిపారు. రూ.716 కోట్ల వ్యయంతో చేపట్టిన కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2026 జనవరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.