Share News

Konda Vishweshwar Reddy: అప్పుడు గొప్పలు చెప్పి.. ఇప్పుడు సంబంధం లేదంటున్నారు

ABN , Publish Date - Jun 12 , 2025 | 03:24 AM

కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇంజినీరింగ్‌ తప్పిదం.. ప్రాజెక్టు డిజైన్‌లోనే లోపాలు ఉన్నాయి.. ఏ కోణంలో చూసినా వైఫల్యాలే ఉన్నాయి.. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పారు.

Konda Vishweshwar Reddy: అప్పుడు గొప్పలు చెప్పి.. ఇప్పుడు సంబంధం లేదంటున్నారు

  • కాళేశ్వరం..అతి పెద్ద ఇంజనీరింగ్‌ తప్పిదం

  • ఆ తప్పులు చూడలేకే పార్టీ నుంచి బయటికొచ్చా

  • చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ‘‘కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇంజినీరింగ్‌ తప్పిదం.. ప్రాజెక్టు డిజైన్‌లోనే లోపాలు ఉన్నాయి.. ఏ కోణంలో చూసినా వైఫల్యాలే ఉన్నాయి.. అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పారు. ఓ గవర్నర్‌ అయితే కేసీఆర్‌ను కాళేశ్వరరావు అని పిలిచారు. ఇప్పుడేమో విచారణ కమిషన్‌ ఎదుట కాళేశ్వరంతో మాకు సంబంధం లేదని బీఆర్‌ఎస్‌ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది’’అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు, డిజైన్‌, నాణ్యత పరంగా లోపాలు, హైడ్రాలజీ, జియాలజీ పరంగా తప్పులు.. ఇలా అన్ని అంశాల్లో వైఫల్యాలే కనిపిస్తున్నాయన్నారు. సైన్స్‌ పరంగా, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఇరిగేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ర్టికల్‌ ఇంజినీరింగ్‌, ఆర్థిక ప్రయోజనాల పరంగా తీవ్ర లోపాలు ఉన్నాయన్నారు. ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థిగా ఆ తప్పులు చూడలేకనే బీఆర్‌ఎ్‌సలో వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పటికీ బయటకు వచ్చానన్నారు.


వానా కాలంలో వరదలు వచ్చే సమయంలో నదికి వ్యతిరేక దిశలో ఎవరైనా నీరు ఎత్తిపోస్తారా? అని ప్రశ్నించారు. వర్షాకాలంలో కేసీఆర్‌ నదీ జలాలను ఎత్తి పోస్తే.. వరుణ దేవుడు అదే సమయంలో పై నుంచి కిందకు వరద వదిలేవారని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు చెప్పినట్టు కాళేశ్వరం వల్లే ధాన్యం దిగుబడి పెరిగిందనడం అబద్ధమని అన్నారు. కాళేశ్వరం నీరు వచ్చిన సమయంలో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి 2 కోట్ల టన్నులైతే.. ఆ నీళ్లు రాకున్నా ఇప్పుడు 2.80కోట్ల టన్నుల దిగుబడి వచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం లేదని, దీనిపై చర్చ కూడా అనవసరమని అన్నారు. దీనిపై వివరంగా చెప్పాలంటే.. తన వద్ద త్రీడీ ప్రజెంటేషన్‌ ఉందని, అన్నీ చెబుతానని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. తాడు కొంటానంటే తాడే కదా అని ఒకరికి.. ముడి వేసుకుంటానంటే ముడే కదా అని ఒకరికి అనుమతిస్తుందని.. తాడు కొని ఉరి వేసుకుంటానంటే మాత్రం కేంద్రం అనుమతించబోదని స్పష్టం చేశారు.

Updated Date - Jun 12 , 2025 | 03:24 AM