Kodandaram: కేసీఆర్ అవాస్తవాలు ప్రచారం చేశారు
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:26 AM
కాళేశ్వరం ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అని మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవాలు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కోదండరామ్ విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎమ్మెల్సీ కోదండరామ్
అంతర్జాతీయంగా అపఖ్యాతి: జయధీర్
కాళేశ్వరం వైఫల్యంపై రేమిల్ల పుస్తకావిష్కరణ
పంజాగుట్ట, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అని మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవాలు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కోదండరామ్ విమర్శించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు రేమిల్ల అవధాని రచించిన ‘కాళేశ్వరం ఫియాస్కో: ఎ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్’ పుస్తకాన్ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, ఆచార్య జయధీర్ తిరుమలరావుతో కలిసి ఆవిష్కరించారు. కోదండరామ్ మాట్లాడుతూ ప్రాజెక్టు చూడడానికి వెళితే పోలీసులు అడ్డుకున్నారని, పారే నదికి అడ్డుగా కట్టలు కట్టి, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి అదే నదిలోకి నీళ్లు ఎత్తిపోయడం ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్న అప్పుడు అందరిలో మొదలైందన్నారు.
పరిశోధనలు చేయకుండానే డ్యామ్ నిర్మించడంతో కుంగిపోయిందన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకులకు ప్రజలు శిక్ష వేస్తారని, అధికార వర్గాన్ని ఎందుకు వదిలేశారని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. కార్యనిర్వాహకవర్గం కూడా తప్పులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. జయధీర్ తిరుమలరావు మాట్లాడుతూ కాళేశ్వరంపై అవధాని చాలా ధైర్యంగా చాలా శ్రమపడి పుస్తకం రాశారని కొనియాడారు. ఈ ప్రాజెక్టు గురించి అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకున్నారని ప్రచారం జరిగిందని, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అంతర్జాతీయంగా అపఖ్యాతి సంతరించుకుందన్నారు.