Kishan Reddy: డాడీ.. డాటర్ లేఖ ఓ డ్రామా
ABN , Publish Date - May 24 , 2025 | 03:09 AM
బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఆ పార్టీ అధినేత కేసీఆర్కు ఆయన కుమార్తె రాసిన లేఖ ఒక డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కవిత లేఖ ఎందుకు రాసిందో అర్థం కాలే: కిషన్రెడ్డి
ఓటీటీ డ్రామాలా లిక్కర్ క్వీన్ కవిత లేఖ : సంజయ్
కవిత లేఖ.. కాంగ్రెస్ కుట్ర?: డీకే అరుణ
మరో షర్మిల కానున్న కవిత: రఘునందన్
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఆ పార్టీ అధినేత కేసీఆర్కు ఆయన కుమార్తె రాసిన లేఖ ఒక డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘డాడీ.. డాటర్ లేఖ ఓ డ్రామా మాత్రమే’’ అని వ్యాఖ్యానించిన ఆయన.. అసలు ఆమె ఆ లేఖ ఎందుకు రాసిందో తనకైతే అర్థం కాలేదని, అందులో కంటెంట్ (విషయమేమీ) లేదని పేర్కొన్నారు. శుక్రవారం, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డాడీ, డాటర్ మధ్య మాటల్లేవన్న సంగతి తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. ఆమె లేఖకు అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదని.. అది వారి మధ్య అంతర్గత విషయమని అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘బీఆర్ఎస్ పార్టీ డాడీ..డాటర్..సన్ పార్టీ. అంతే కాదు.. సన్ ఇన్ లా (అల్లుడు).. స్ట్రోక్ పార్టీ.. ఇది నాలుగు స్తంభాల ఆటలాంటిది’’ అని కిషన్రెడ్డి వ్యంగ్యవ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, ఎప్పుడూ ప్రజాసంఘాలను, రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలను కలవలేదని.. 2019లో తాను మొదటిసారి కేంద్రమంత్రి అయిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ను గౌరవంగా కలవాలనుకున్నా తనకే ఆయన సమయం ఇవ్వలేదని కిషన్ రెడ్డి చెప్పారు. ‘‘నేను అప్పుడే ఈ మాట అంటే, మా డాడీ అందరినీ కలుస్తారంటూ డాటర్ చెప్పారు. కానీ, కేడర్ను కలుస్తలేరనే విషయాన్ని ఇప్పుడు ఆమెనే చెప్పింది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్ బీజేపీపై రెండే నిమిషాలు తిట్లు తిట్టారని ఆమె రాశారు. పదేళ్లు తిట్టింది సరిపోదా? ఐనా.. మునిగిపోయిన పార్టీ తిడితేంది? తిట్టకపోతేంది?’’ అని ఎద్దేవా చేశారు. అలాగే.. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన కేసును సీబీఐకి అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
డ్రామాలకు కేరాఫ్గా..
ఒకప్పుడు ఉద్యమాలకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ, ఇప్పుడు డ్రామాలకు కేరా్ఫగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మద్యం కంపు పుట్టించిన లిక్కర్ క్వీన్ వాళ్ల నాన్నకు రాసిన లేఖ ఇప్పుడు ఓటీటీ డ్రామాను తలపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘బహుశా ‘కాంగ్రెస్ వదిలిన బాణం’ పేరుతో ఇది తెరకెక్కితే ఓటీటీ రికార్డులు తిరగరాస్తుందేమో అన్నంత డ్రామా ఇందులో ఉంది మరి’’ అని బండి వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడంలో విఫలమైన బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీపై ఏడుస్తూ నిట్టూరుస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇక.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న లేఖ కాంగ్రెస్ కుట్రేమోనని బీజేపీ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఆ పార్టీనే కవిత పేరుతో లేఖ విడుదల చేసిందేమోనని సందేహం వ్యక్తం చేశారు. ఆ లేఖపై కేసీఆర్, కవిత స్పందిస్తేనే స్పష్టత వస్తుందని అరుణ అన్నారు. అయినా.. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని అరుణ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ను కలిసే పరిస్థితి కూడా కవితకు లేదా? అన్న కేటీఆర్తో ఉన్న రాజకీయ వైరంలో ఇది భాగమేనా? కవిత ఉద్దేశపూర్వకంగా లేఖ లీక్ చేశారా? లేక ఎవరిద్వారానైనా లీక్ చేయించారా? లేఖ రాయించినవాళ్లు లీక్ చేశారా? కేసీఆర్ లీక్ చేశారా?’’ అనే విషయాలు వారు చెబితే తప్ప స్పష్టత రాదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎ్సతో బీజేపీ పొత్తు ప్రసక్తేలేదని ఆమె తేల్చిచెప్పారు. ఇక.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరో షర్మిల కాబోతున్నట్లుగా కనిపిస్తోందని బీజేపీ ఎంపీ ఎం. రఘునందన్రావు వ్యాఖ్యానించారు. తనకున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ మొదటగా కవితతో కొత్త పార్టీ పెట్టిస్తుందని.. ఎన్నికల సమయంలో కవిత, షర్మిల లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులవుతారని లేదా ఆమె పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ డ్రామా వెనుక సీఎం రేవంత్ ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. ‘‘కవిత లేఖ నేపథ్యం.. కుటుంబ పంచాయతీనా? రాజకీయ వారసత్వ పంచాయితీనా? ఆస్తుల పంచాయతీనా?’’ అని రఘునందన్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం
Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్లోంచి..