Palm Oil Farmers: ఆనందంలో పామాయిల్ రైతులు.. కారణమిదే
ABN , Publish Date - Nov 01 , 2025 | 02:03 PM
ఓఈఆర్ పెరగటంతో వచ్చే నెల నుంచి కొత్త ధర అమలులోకి రానున్నాయి. టన్నుకు 500 రూపాయలకుపైగా ధర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ రైతులకు (Palm Oil Farmers) శుభవార్త అందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావు పేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ రేషియో (OER) 20.01 శాతం రికవరీ అయ్యింది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ఓఈఆర్ నమోదు కావడంతో పామాయిల్ గెలల ధరలు పెరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పామాయిల్ గెలల టన్ను ధర రూ. 19,400గా ఉంది. ఓఈఆర్ పెరగటంతో వచ్చే నెల నుంచి కొత్త ధర అమలులోకి రానున్నాయి. టన్నుకు 500 రూపాయలకుపైగా ధర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పామాయిల్ రైతులకు పెద్ద ఊరటనిచ్చే వార్త అనే చెప్పుకోవచ్చు.
ఓఈఆర్ పెరగడంతో ఆయిల్ ఫెడ్ అధికారులను , ఫ్యాక్టరీ సిబ్బందిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minster Thummala Nageshwar Rao) అభినందించారు. పామాయిల్ రైతులకు మహర్దశ పట్టనుందన్నారు. ఆయిల్ పామ్ హబ్గా తెలంగాణ మారనుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పామాయిల్ రైతుల సమావేశంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఓఈఆర్ పెరగడం రాష్ట్ర పామాయిల్ రైతులకు శ్రమకు ప్రతిఫలం అని తెలిపారు. ఇక ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ రేషియో (ఓఈఆర్) పెరగటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.