Bhatti Vikramarka OBC Reservation: బంద్కు ప్రధాన కారణం బీజేపీనే: డిప్యూటీ సీఎం భట్టి
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:40 AM
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాలకు కూడా వెళ్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఓబీసీపై సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాదులు పోరాడుతున్నారని తెలిపారు.
ఖమ్మం, అక్టోబర్ 17: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తొలిసారిగా సైంటిఫిక్గా తెలంగాణలో కులగణన నిర్వహించామని.. సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చూసినట్లు తెలిపారు. చట్ట సభల్లో ఏకగ్రీవాగంగా ప్రవేశ పెట్టామని.. గవర్నర్, రాష్ట్రపతికి పంపించినట్లు తెలిపారు. అయితే తాము పాస్ చేసిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా అడ్డుకట్ట వేసి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతోందని ఆరోపించారు. ఇది బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు భట్టి.
ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లపై ధర్నా చేశామని.. బీజేపీ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాలకు కూడా వెళ్తోందన్నారు. ఓబీసీపై సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాదులు పోరాడుతున్నారని తెలిపారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం పార్లమెంట్లో పెట్టకపోవడం వల్లే... ఓబీసీలకు 42శాతం రిజర్వేషన్ కష్టమని సుప్రీం కోర్టు చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీ పార్టీ వల్లనే బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా పెండింగ్లో ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రంలో ఓబీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయన్నారు. రేపు జరిగే ఓబీసీ బంద్కు ప్రధాన కారణం బీజేపీ అని అన్నారు. ఓబీసీల బంద్లో అన్ని పార్టీల సంఘాలు ఆమోదం తెలిపాయని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
ఓబీసీ బిల్లుపై ఎందుకు మొండి వైఖరి చూపిస్తున్నారని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్లను ప్రశ్నించారు. ప్రధానితో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఓబీసీ బిల్లును ఎందుకు పాస్ చేయించడం లేదని నిలదీశారు. బిల్లులకు అడ్డుపడుతూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క బీసీలే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా.. బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ చేస్తున్న ఆగడాలను అందరూ గమనిస్తున్నారని.. కమలం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రేపు బంద్ జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
సింగరేణి కార్మికుల బోనస్పై
కాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం. సింగరేణి కార్మికులకు దీపావళికి 400 కోట్ల రూపాయల బోనస్ చెల్లిస్తున్నామని ప్రకటించారు. సింగరేణి ఖమ్మం జిల్లా నుండే మొదలైందని.. ఇక్కడ మొదలై రాష్ట్రం అంతటా వ్యాపించిందన్నారు. సింగరేణి కార్మికులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
కాసేపట్లో జిమ్ ఓపెనింగ్... కానీ అంతలోనే
Read Latest Telangana News And Telugu News