Share News

Kavitha: జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:36 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వర్షాకాల అత్యవసర, తక్షణ మరమ్మతు బృందాలకు సంబంధించిన టెండర్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రభుత్వాన్ని కోరారు.

Kavitha: జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాల.. టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

  • స్థానిక కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగేలా, ప్రజాధనం వృధా అయ్యేలా నిబంధనలు

  • రెండు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా అధికారుల యత్నం

  • వారిపై చర్యలు తీసుకోవాలి

  • డివిజన్ల వారీగా టెండర్లు : కవిత

  • సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వర్షాకాల అత్యవసర, తక్షణ మరమ్మతు బృందాలకు సంబంధించిన టెండర్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రభుత్వాన్ని కోరారు. డివిజన్ల వారీగా తిరిగి టెండర్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆదివారం ఆమె బహిరంగ లేఖ రాశారు. స్థానిక కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగేలా, ప్రజాధనం వృధా అయ్యేలా టెండర్‌ నిబంధనలున్నాయని, తమకు నచ్చిన సంస్థలకు పనులు కట్టబెట్టేలా అధికారులు వ్యవహరిస్తున్నారని లేఖలో కవిత ఆరోపించారు. డివిజన్ల వారీగా టెండర్లు పిలిస్తే.. 150 మంది కాంట్రాక్టర్లకు ఉపాధి కలుగుతుందన్నారు. కానీ, జోన్‌ల వారీగా టెండర్లు పిలవడంతో తొమ్మిది టెండర్లు మాత్రమే దాఖలు చేేస అవకాశం లభించిందని, వాటిని కూడా రెండు సంస్థలకే కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. పైగా, ఈ పనులు చేపట్టేందుకు వినియోగించే వాహనాల్లో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలన్న నిబంధన ఉందని, కానీ.. అలాంటి వాహనాలు విక్రయించే డీలర్లు హైదరాబాద్‌లో ఇద్దరే ఉన్నారని తెలిపారు. స్థానిక కాంట్రాక్టర్లకు వాహనాలు సరఫరా చేసేందుకు ఆయా డీలర్లు సమ్మతి తెలపకపోవడంతో.. వారు కర్ణాటక డీలర్ల నుంచి ఎంవోయూ తీసుకొని టెండర్లలో పాల్గొన్నారని చెప్పారు.


అయితే ఆ కాంట్రాక్టర్లు ఎంవోయూ ఫిజికల్‌ కాపీలు సమర్పించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సమయం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఫిజికల్‌ కాపీలు సమర్పించలేదనే సాకు చూపించి స్థానిక కాంట్రాక్టర్లను టెండర్లలో అనర్హులుగా నిర్ణయించి.. ముందే ఒప్పందం కుదుర్చుకున్న రెండు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. వర్షాకాల అత్యవసర, తక్షణ మరమ్మతు పనుల కోసం గతంలో వినియోగించిన వాహనాల ద్వారా రెండు, మూడు క్యూబిక్‌ మీటర్ల మెటీరియల్‌ను తరలించే అవకాశం ఉండేదని కవిత గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు జీహెచ్‌ఎంసీ జారీ చేసిన టెండర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఏర్పాట్లు ఒక విదేశీ కంపెనీకి చెందిన వాహనాలకు మాత్రమే ఉందన్నారు. ఆ వాహనాల్లో ఒక క్యూబిక్‌ మీటర్‌ మెటీరియల్‌ను తరలించడం కూడా సాధ్యం కాదని మీడియా కథనాల ద్వారా తెలుస్తోందన్నారు. పైగా, ఇందుకోసం గతంలో వ్యయమైన రూ.5.40 కోట్లు రెట్టింపయి రూ.11.25 కోట్లకు చేరిందని తెలిపారు. దీంతో ఏటా రూ.5.85 కోట్ల ప్రజాధనం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. మునిసిపల్‌ శాఖను ముఖ్యమంత్రే చూస్తున్నందున.. ఆ శాఖ పరిధిలోని జీహెచ్‌ఎంసీ టెండర్లలో తెలంగాణ బీసీ కాంట్రాక్టర్లకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని లేఖలో కవిత కోరారు. టెండర్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి

తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..

మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Updated Date - Jun 02 , 2025 | 05:36 AM