Saraswati Pushkaralu: ఆరో రోజూ అదే రద్దీ
ABN , Publish Date - May 21 , 2025 | 06:55 AM
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేసి కాళేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు, ఇతర ఆలయాలకూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

సరస్వతీ పుష్కరాలకు తరలివస్తున్న భక్తులు
ఇతర ముఖ్య ఆలయాలకూ భక్తుల తాకిడి
భూపాలపల్లి/హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ నది పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆరో రోజైన మంగళవారం దాదాపు 50 వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం నుంచి భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం.. భక్తులకు ఎండ వేడి నుంచి రక్షణ కలిగించేలా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. గోదావరిలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎ్ఫ, సింగరేణి బృందాలను, గజ ఈతగాళ్లను మొహరించింది. మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజన, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ తరుణ్ జోషి తదితరులు నదిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు కాళేశ్వరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రఖ్యాత ఆలయాలను కూడా సందర్శిస్తున్నారు. పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న నవరత్నమాల హారతి ఘట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంగళవారం నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.