Share News

Union Minister Kishan Reddy: కాచిగూడకు సరికొత్త వెలుగు

ABN , Publish Date - Jun 10 , 2025 | 06:49 AM

సరికొత్త ఫసాడ్‌ లైటింగ్‌ వ్యవస్థతో చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌ దేదీప్యమానంగా వెలిగిపోతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 1916లో గోతిక్‌ శైలిలో నిర్మించిన ఈ స్టేషన్‌ను మరింత ఆకర్షణీయంగా చూపించడానికి 785 ఇల్యూమినేషన్‌ లైట్లను ఏర్పాటు చేశామని...

Union Minister Kishan Reddy: కాచిగూడకు సరికొత్త వెలుగు

  • ఫసాడ్‌ లైటింగ్‌తో ఆకర్షణీయంగా స్టేషన్‌

  • దేశాభివృద్ధిలో జీఎ్‌సఐ పాత్ర అద్భుతం

  • కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రికొత్త ఫసాడ్‌ లైటింగ్‌ వ్యవస్థతో చారిత్రక కాచిగూడ రైల్వే స్టేషన్‌ దేదీప్యమానంగా వెలిగిపోతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 1916లో గోతిక్‌ శైలిలో నిర్మించిన ఈ స్టేషన్‌ను మరింత ఆకర్షణీయంగా చూపించడానికి 785 ఇల్యూమినేషన్‌ లైట్లను ఏర్పాటు చేశామని, ఆ కాంతుల్లో స్టేషన్‌ ప్రాంగణం కనువిందుగా ఉందని పేర్కొన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌ వద్ద కేంద్ర పర్యాటక శాఖ రూ.2.23 కోట్లతో ఏర్పాటు చేసిన ఫసాడ్‌ లైటింగ్‌ వ్యవస్థను ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, సిర్పూర్‌ ఎమ్మెల్యే హరీశ్‌ బాబు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌తో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. అమృత్‌ భారత్‌ పథకం కింద రూ.421.66 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్‌ ఎనర్జీని ఉపయోగించుకుంటూ కాచిగూడ స్టేషన్‌ పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తోందని చెప్పారు. గ్రీన్‌ రైల్వే స్టేషన్లకు రేటింగ్‌ ఇచ్చే ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ కాచిగూడ స్టేషన్‌కు ప్లాటినం రేటింగ్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. కాగా, దేశంలోని వనరుల అన్వేషణ, ఖనిజాలను గుర్తించి భద్రపరచడంలో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఐఎస్‌) 175 ఏళ్లుగా అందిస్తున్న సహకారం అద్భుతమని కిషన్‌రెడ్డి కొనియాడారు. నాగోల్‌ బండ్లగూడలోని ‘నెక్ట్స్‌ జెన్‌ జియోఫిజిక్స్‌-2025’ సదస్సును కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. జీ-7, జీ-20 వంటి ప్రపంచ వేదికలపై భారత దేశం కీర్తి గడిస్తోందని, కీలకమైన ఖనిజాలను భద్రపరచడంలో దేశం వ్యూహాత్మక దృష్టితో ముందుకు సాగుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


ఖనిజ భద్రత, పర్యావరణ స్థితిస్థాపకత, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో భౌగోళిక శాస్త్రీయ పరిశోధన కీలకంగా వ్యవహరిస్తోందని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఖనిజ పరిశోధన, స్థిరమైన వనరుల నిర్వహణలో జీఎ్‌సఐ పాత్ర అభినందనీయమన్నారు. ప్రతీ ఉపాధ్యాయుడు యోగా అంబాసిడర్‌ కావాలని కిషన్‌రెడ్డి సూచించారు. పద్మారావునగర్‌లోని సీజీవో కార్యాలయంలో యోగా వేడుకల కోసం జరిగిన సన్నద్ధత కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

‘పసుపు బోర్డు’ ప్రారంభోత్సవానికిఅమిత్‌ షా

నిజామాబాద్‌లోని పసుపు బోర్డు ప్రధా న కార్యాలయాన్ని ప్రారంభించేందుకు రావాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ఎంపీ అర్వింద్‌, పసుపు బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి ఆహ్వానించారు. తమ విజ్ఞప్తికి షా అంగీకరించారని, ఈ నెలాఖరులోగా కార్యక్రమం ఉంటుందని అర్వింద్‌ తెలిపారు.

Updated Date - Jun 10 , 2025 | 06:52 AM