HYDRA: హైడ్రా ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు
ABN , Publish Date - May 20 , 2025 | 05:12 AM
హైడ్రాలో డ్రైవర్లుగా చేరేందుకు నిరుద్యోగులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయానికి చేరుకుని దరఖాస్తులతో బారులు తీరారు.

హైదరాబాద్ సిటీ/కేపీహెచ్బీ కాలనీ, మే 19 (ఆంధ్రజ్యోతి): హైడ్రాలో డ్రైవర్లుగా చేరేందుకు నిరుద్యోగులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయానికి చేరుకుని దరఖాస్తులతో బారులు తీరారు. గంటల తరబడి లైనులో నిరీక్షించి వాటిని అందజేశారు. సంస్థలోని విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పర్యవేక్షణ తదితర విభాగాల్లోని వాహనాలను నడిపేందుకు 200 మంది డ్రైవర్లు కావాలంటూ నోటిఫికేషన్ విడుదల అయింది. 2022-23లో కానిస్టేబుల్ పరీక్షలు రాసి.. తక్కువ మార్కులతో ఉద్యోగాలకు దూరమైన వారికి మాత్రమే అవకాశం ఇవ్వనున్నట్టు అందులో పేర్కొన్నారు. 19, 20 తేదీల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. సుమారు 850 మంది దరఖాస్తు చేశారని హైడ్రా వర్గాలు తెలిపాయి. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ తుది ఫలితాల జాబితా ఆధారంగా.. అందులో పేర్లున్న వారి నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించారు. కాగా.. నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సోమవారం అధికారులు రంగంలోకి దిగారు. హైదర్నగర్లోని డైమండ్ హిల్స్, పుప్పాల్గూడలోని డాలర్ హిల్స్లో రోడ్లు, పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. హైదర్నగర్ సర్వే నంబర్ 145లోని 9 ఎకరాల స్థలంలో 2000 సంవత్సరంలో హెచ్ఎండీఏ (అప్పటి హుడా) అనుమతితో లే-అవుట్ అభివృద్ధి చేశారు. అయితే.. 2007లో అన్ రిజిస్టర్డ్ అసైన్మెంట్ డీడ్తో డాక్టర్ ఎన్ఎ్సడీ ప్రసాద్ రంగంలోకి దిగడంతో అక్కడ ఆక్రమణల పర్వం మొదలైంది. స్విమ్మింగ్ పూల్, రోడ్లు, పార్కులు, ప్లాట్ల హద్దులు చెరిపేసి దాదాపు 7 ఎకరాలు ఆక్రమించినట్టు ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పునూ ఆక్రమణదారులు పట్టించుకోవడం లేదని వివరాలు సమర్పించారు.
ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించారు. ఇరు పక్షాలనూ కార్యాలయానికి పిలిచి విచారించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు రహదారులు, పార్కుల్లో ఉన్న ఆక్రమణలు తొలగించి, బోర్డులు ఏర్పాటు చేశారు. నార్సింగి మండలం పుప్పాల్గూడలోనూ అదే పరిస్థితి. అక్కడ వివాదంలో ఉన్న భూమిలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశాలిచ్చినా.. ఎన్సీసీ అనే సంస్థ భవనాలు నిర్మిస్తోందని డాలర్హిల్స్ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14వ తేదీన క్షేత్రస్థాయిలో పరిశీలించిన రంగనాథ్ వెంటనే నిర్మాణాలు నిలిపివేయాలని సూచించారు. అంతకుముందు చేపట్టిన నిర్మాణాలనూ కూల్చివేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్సిటీ ఫైర్ యాక్సిడెంట్కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News