JD Lakshmi Narayana: గాలిని పట్టుకునేందుకు మారువేషాల్లో వెళ్లాం
ABN , Publish Date - May 07 , 2025 | 03:13 AM
గాలి జనార్దన్రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ బృందం ఐటీ అధికారులుగా హోటల్లో దిగింది. అతని నెట్వర్క్ను దృష్టిలో ఉంచుకుని సీక్రెట్గా దాడి చేసి నగదు, బంగారం, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ మైనింగ్ నిరూపించేందుకు శాటిలైట్ చిత్రాలు తెప్పించాం
అక్రమ గనుల తవ్వకాలు జరిపే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం
ఎంత తవ్వారు? అక్రమం ఎంత? అన్న సాక్ష్యాలు పక్కాగా ఇచ్చాం
ఆనాటి మా దర్యాప్తులో వెల్లడైందే నేడు రుజువయింది
నాటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు.. అక్రమ మైనింగ్ చేసేవారికి ఒక గుణపాఠం అవుతుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఆనాడు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు నిర్వహించిన లక్ష్మీనారాయణ.. అప్పట్లో తమ దర్యాప్తులో వెల్లడైన విషయాలే ఇప్పుడు రుజువయ్యాయని పేర్కొన్నారు. గాలి జనార్దన్రెడ్డిని పట్టుకునేందుకు మారువేషాల్లో వెళ్లామన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆనాటి అనుభవాలను లక్ష్మీనారాయణ ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ‘‘విచారణలో అనేక అనుభవాలున్నాయి. కళ్లముందు అక్రమ మైనింగ్ జరిగిందని కనిపిస్తున్నా.. నిరూపించేందుకు కావాల్సింది సాక్ష్యం. దానికోసం అప్పట్లో అనుసరించిన పద్ధతులు అపూర్వం. శాస్ర్తీయంగా అక్రమాలు నిరూపించాం. రూ.882 కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పాం’’ అని సీబీఐ మాజీ జేడీ అన్నారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందన్నది స్పష్టమని, కానీ.. అది ఎక్కడ జరిగింది, ఎంత జరిగిందన్నది నిరూపించడం చాలా కష్టమయిందని చెప్పారు. తాము విచారణ ప్రారంభించేసరికే అక్కడ తవ్వకాలన్నీ అయిపోయాయని, అక్కడికి వెళ్లేసరికి అన్నీ ఖాళీ గోతులే ఉన్నాయని తెలిపారు. దీంతో ఏం చేయాలన్నది ఆలోచించి అమెరికా నుంచి ఆ ప్రాంతం శాటిలైట్ ఇమేజ్లు తెప్పించామని, వాటిని క్షేత్రస్థాయిలో సరిపోల్చామని వివరించారు. మళ్లీ అక్కడ మైనింగ్ సీన్ మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి.. ఏ రోజు ఎంత తవ్వకం జరిగి ఉంటుందన్నది లెక్కలేసి పరిశీలించామన్నారు. ‘‘అనుమతులు ఇచ్చింది ఎక్కడ, ఎంత పరిమాణం? తవ్వింది ఎక్కడ, ఎంత పరిమాణం? వంటివన్నీ లెక్కలేశాం. సింగరేణి సర్వే బృందాలతో మళ్లీ సర్వే చేయించాం. చివరకు ఎంత ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వారో అంచనా వేసి.. రూ.882 కోట్లుగా తేల్చాం. దాదాపుగా అదే ఇప్పుడు నిజమైంది’’ అని లక్ష్మీనారాయణ అన్నారు.
ఐటీ అధికారుల్లా హోటల్లో దిగాం..
‘‘అప్పుడు ఎంత జాగ్రత్తగా విచారణ చేశామన్న దానిపై ఒక్క విషయం చెబుతాను. గాలి జనార్దన్రెడ్డిని అరెస్టు చేసేందుకు మా బృందంతో బళ్లారికి వెళ్లాం. అక్కడ హోటల్లో ఎక్కడా సీబీఐ అధికారులమని చెప్పలేదు. ఐటీ అఽధికారులమని చెప్పాం. ఎందుకంటే బళ్లారిలో అతని నెట్వర్క్ పెద్దది. సీబీఐ అనగానే అప్రమత్తం అయిపోవచ్చు. ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, పత్రాలు తరలించివేయొచ్చు. అందుకే సీబీఐలా కాకుండా వేరేలా వెళ్లాం. ఉదయాన్నే ఇంటికెళ్లి అరెస్టు చేసి.. ఇంట్లో ఉన్న కీలక పత్రాలు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నాం. అన్నింటినీ హెలికాప్టర్లో సీబీఐ కార్యాలయానికి తరలించాం’’ అని సీబీఐ మాజీ జేడీ వివరించారు. గాలి జనార్దన్రెడ్డి కేసును విచారించేటప్పుడు తమపై ఒత్తిడేమీ లేదని లక్ష్మీనారాయణ తెలిపారు. ‘‘ఓవైపు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకునే నేత ఆయన. మరోవైపు రాంజెఠ్మలానీ, ఉదయ్ లలిత్ లాంటి పేరుమోసిన న్యాయవాదులు దిగేవారు. అయినా మా సీబీఐ లీగల్ టీం బాగా పనిచేసింది. నాటి సీబీఐ అధికారులు వెంకటేశ్, ఆర్.ఎం.ఖాన్ తదితరులంతా బాగా సహకరించారు. అంతా కలిసి ఒక బృందంలా పనిచేశాం’’ అని వివరించారు.