Jajula Srinivas Goud: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్ర వైఖరేంటి
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:12 AM
బీసీ రిజర్వేషన్ల చట్టంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, జాజుల శ్రీనివాస్ గౌడ్ దీక్షకారులకు మద్దతు ప్రకటించారు. కేంద్రమంత్రులు వెంటనే ఈ విషయంలో స్పందించి, దీక్షను ముగిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు

హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్రప్రభుత్వం చేసిన చట్టంపై తన వైఖరేంటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు తరహాలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దానికోసం ఢిల్లీలో బీసీ హిందూ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్ ఇరవై రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ, కేంద్రంలో ఎందుకు జాప్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. దీక్ష చేస్తున్న సిద్దేశ్వర్కు ఏదైనా జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఇప్పటికైనా సిద్దేశ్వర్తో కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ మాట్లాడి దీక్ష విరమింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు.