Share News

TPCC Jagga Reddy: సీఎం రేవంత్‌, మంత్రులది ప్రజా పాలన

ABN , Publish Date - Jul 19 , 2025 | 05:12 AM

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులది ప్రజా పాలనైతే.. పదేళ్ల పాటు కేసీఆర్‌ చేసింది ఫామ్‌హౌస్‌ పాలనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

TPCC Jagga Reddy: సీఎం రేవంత్‌, మంత్రులది ప్రజా పాలన

పదేళ్ల కేసీఆర్‌ పాలన.. ఫామ్‌హౌస్‌ పాలన.. నిధుల కోసమే సీఎం, మంత్రులు ఢిల్లీకెళ్లారు

  • రేవంత్‌ కూడా ఫామ్‌హౌ్‌సలో ఉండాలా?

  • తొక్కాలనుకుంటే రాజకీయంగా తొక్కేస్తాం

  • మాకు నిఘా పెట్టాల్సిన అవసరం లేదు

  • హరీశ్‌రావు పెద్ద యాక్టర్‌.. ఉత్తమ్‌ ఫైటర్‌

  • రేవంత్‌ను చంద్రబాబు శిష్యుడని కేటీఆర్‌, హరీశ్‌లు అంటున్నరు

  • టీడీపీలో కేసీఆర్‌ మంత్రిగా పనిచేయలేదా?

  • కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు.. లోకేశ్‌, జగన్‌లతో వేర్వేరుగా కేటీఆర్‌ భేటీలు

  • చాటుమాటు సంసారం చేసేదే వారు..

  • బుదర చల్లేది మాపైనా?: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులది ప్రజా పాలనైతే.. పదేళ్ల పాటు కేసీఆర్‌ చేసింది ఫామ్‌హౌస్‌ పాలనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఆ పదేళ్లూ కేసీఆర్‌ సచివాలయానికి రాలేదని, అలాగని ప్రజల మధ్యా తిరగలేదని విమర్శించారు. అలాగే ప్రజల సమస్యలు, రాష్ట్రాభివృద్ధికి నిధుల కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కలిసిందీ లేదన్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం, రాష్ట్రాభివృద్ధికి నిధుల కోసం కేంద్ర ప్రభు త్వ పెద్దలను కలవడానికి సీఎం రేవంత్‌, మంత్రులు పదే పదే ఢిల్లీకి వెళుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌.. పదేళ్లు ఫామ్‌హౌస్‌ పాలన చేశాడు కాబట్టి.. సీఎం, మంత్రులు కూడా ఫామ్‌హౌ్‌సలో ఉండాలని వారు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు నీళ్ల పంచాయితీ ఉండటం సహజమని, సమస్య పరిష్కారం కోసం కేంద్రం పిలిచింది కాబట్టే ఏపీ, తెలంగాణ సీఎంలు ఢిల్లీకివెళ్లారన్నారు. సమస్యపై ఇద్దరు సీఎంలు కూర్చుని మాట్లాడుకోవడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏమీ కేటీఆర్‌లాగా చాటుమాటు మీటింగ్‌లు పెట్టలేదన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు.. బీజేపీ డైరెక్షన్‌లో నారా లోకేశ్‌, వైఎస్‌ జగన్‌లతో కేటీఆర్‌ వేర్వేరుగా రహస్య భేటీలు నిర్వహించారని ఆరోపించారు.


ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రహస్య భేటీలు జరిగాయన్నారు. చాటుమాటు సంసారం చేసేది వారు.. బురద చల్లేది తమపైనా అంటూ నిలదీశారు. కాగా.. హరీశ్‌రావుపై తమ ప్రభుత్వం నిఘా పెట్టి చేసేదేముందని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తాము రాజకీయంగా తొక్కాలనుకుంటే నేరుగానే తొక్కుతామని, వారిలాగా పోలీసులను అడ్డంపెట్టుకుని చేయబోమన్నారు. సీఎం రేవంత్‌తో ముఖాముఖీకి రావాలంటే కేసీఆర్‌ భయపడతాడని, అందుకే ఆయన అసెంబ్లీకి రావట్లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి.. జై తెలంగాణ అనట్లేదని హరీశ్‌రావు మాట్లాడుతున్నాడని, టీఆర్‌ఎ్‌సలో తెలంగాణ అనే పేరును తీసేసిన వారికి ప్రశ్నించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. హరీశ్‌ పెద్ద యాక్టర్‌ అయితే.. యుద్ధ విమానం నడిపిన ఫైటర్‌ మంత్రి ఉత్తమ్‌ అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు భేటీ అయితే వివరాలు బయటపెట్టాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘సీఎం రేవంత్‌కి చంద్రబాబు గురువని కేటీఆర్‌, హరీశ్‌లు మాట్లాడుతున్నరు. రేవంత్‌ కంటే ముందు టీడీపీలో కేసీఆర్‌ మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు కదా? చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా చేశాడు కదా? ఇంకా రేవంత్‌ను విమర్శించే హక్కు వారికెక్కడిది?’’ అంటూ జగ్గారెడ్డి నిలదీశారు.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 05:12 AM