Hyderabad: ఆ అధికారి ఎవరు?
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:31 AM
ఐఏఎస్లపై రిటైర్డ్ అధికారి పర్యవేక్షణ’ అనే శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితం అయిన కథనంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు.

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఆరా తీసిన నిఘా వర్గాలు
హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : ‘ఐఏఎస్లపై రిటైర్డ్ అధికారి పర్యవేక్షణ’ అనే శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితం అయిన కథనంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. సచివాలయంలో సంబంధిత అధికారి ఎక్కడ పని చేస్తున్నారు... ఏం సబ్జెక్టులు చూస్తున్నారు... అనే సమాచారం సేకరించారని తెలిసింది. ఆయన జీఏడీలో డిప్యూటీ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసి, అనంతరం కాలుష్య నియంత్రణ మండలిలో సలహాదారుగా పొరుగు సేవల కింద నియమితులయ్యారు.
జీతం ఒకచోట తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా జీఏడీలో పని చేయడం, అత్యంత కీలక విభాగాలకు సర్క్యులేటింగ్ అధికారి హోదాలో వ్యవహరించడం సచివాలయ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయ సీపీఆర్వో కూడా జీఏడీ అధికారులను సంప్రదించి వివరాలు సేకరించినట్లు తెలిసింది.