Rice Production: సస్యశ్యామల భారతం
ABN , Publish Date - May 20 , 2025 | 06:06 AM
సుజలాం.. సుఫలాం.. మలయజ శీతలాం.. సస్యశ్యామలాం మాతరం.. అంటూ ప్రపంచంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతోంది.

బియ్యం ఉత్పత్తిలో చైనాను దాటి భారత్ రికార్డు
14.9 కోట్ల టన్నులతో ముందంజ
2వ స్థానంలో చైనా.. 14.46 కోట్ల టన్నులు
తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అధికదిగుబడి!
గోధుమ ఉత్పత్తిలో భారత్కు రెండో స్థానం
పడిపోతున్న నూనె గింజల ఉత్పత్తి
న్యూఢిల్లీ, మే 19: సుజలాం.. సుఫలాం.. మలయజ శీతలాం.. సస్యశ్యామలాం మాతరం.. అంటూ ప్రపంచంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతోంది..! గత ఏడాది(2024-25) మూడు సీజన్లలో-- రబీ, ఖరీఫ్, జైద్లో వరి దిగుబడిలో.. బియ్యం ఉత్పత్తిలో ముందంజలో నిలిచింది. ఇప్పటి దాకా బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానాన్ని కొనసాగించిన చైనాను వెనక్కి తోసిన భారత్.. గత ఏడాది 14.9 కోట్ల టన్నుల మేర బియ్యాన్ని ఉత్పత్తి చేసింది. చైనా 14.46 కోట్ల టన్నులకు పరిమితమైందని అమెరికా వ్యవసాయ శాఖ(యూఎ్సడీఏ) గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ 14.8 కోట్ల టన్నుల మేర ఉత్పత్తి సాధించనుందని, చైనా కొంత మెరుగుదలతో 14.52 కోట్ల టన్నుల ఉత్పత్తిని నమోదు చేస్తుందని ముందస్తు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్ ఈ ఘనత సాధించడంలో రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దాంతోపాటు.. భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందంటున్నారు.
పెరిగిన పంట విస్తీర్ణం
2023-24తో పోలిస్తే.. గత ఏడాది పంట విస్తీర్ణం పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మూడు సీజన్లలో కలిపి 2023-24లో వరి విస్తీర్ణం 4.78 కోట్ల హెక్టార్లుగా ఉండగా.. 2024-25లో అది మరో 5.1 కోట్ల హెక్టార్ల మేర పెరిగింది. జైద్ సీజన్లో పంట దిగుబడి ఏకంగా కోటి టన్నులకు చేరుకోవడం కూడా భారత్ను బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలబెట్టడానికి దోహదపడినట్లు వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.
రాష్ట్రాల పథకాలతో ఊతం
ఒకప్పుడు వరి పంటలో వాయవ్య రాష్ట్రాలు ముందంజలో ఉండేవి. పంజాబ్ లాంటి రాష్ట్రాలు అధిక దిగుబడిని సాధించేవి. గడిచిన పదేళ్లలో వాయవ్యంలో దిగుబడి యథావిధిగా కొనసాగుతూనే.. వరిని అధికంగా పండించే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీ్సగఢ్, ఒడిసాల్లో విస్తీర్ణం, ఉత్పత్తి బాగా పెరిగింది. వరి ఉత్పత్తిలో దేశంలోనే పంజాబ్ను వెనక్కి నెట్టేసిన తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచి.. ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి చేస్తున్న సాయం కూడా భారత్ వరి దిగుబడిలో అగ్రస్థానంలో నిలవడానికి కారణమైందని నిపుణులు వివరిస్తున్నారు. ఉచిత విద్యుత్తు, ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర(ఎంఎ్సపీ) వంటి అంశాలు రైతులను వరి వైపు ఆకర్షించినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు భూసార పరీక్షలు నిర్వహించడం, నాట్లు మొదలు.. కోతల వరకు వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు సహకరిస్తుండడంతో.. దిగుబడి బాగా పెరిగినట్లు తెలుస్తోంది. 2014-15తో పోలిస్తే.. 2024-25 వరకు దేశంలో వరి దిగుబడి దాదాపు 4.5 కోట్ల టన్నుల మేర పెరగడం గమనార్హం..!
గోధుమల దిగుబడిలోనూ..
గోధుమల దిగుబడిలోనూ భారత్ దూసుకుపోతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2014-15లో భారత్లో గోధుమల దిగుబడి 8.65 కోట్ల టన్నులు కాగా.. 2024-25లో 11.7 కోట్ల టన్నులకు చేరుకుంది. గోధుమ ఉత్పత్తిలో చైనా 14.2 కోట్ల టన్నులతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. వరి, గోధుమలతోపాటు.. పలు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ మంచి పురోగతిని సాధిస్తున్నా.. నూనెగింజల ఉత్పత్తి మాత్రం స్వల్పంగా పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలో వరి ఉత్పత్తి
సంవత్సరం దిగుబడి
(కోట్ల టన్నుల్లో)
2015-16 10.44
2016-17 10.97
2017-18 11.27
2018-19 11.64
2019-20 11.88
2020-21 12.43
2021-22 12.94
2022-23 13.57
2023-24 13.78
2024-25 14.90
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్సిటీ ఫైర్ యాక్సిడెంట్కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News