CBI: రూ.70 లక్షల లంచం డిమాండ్
ABN , Publish Date - May 11 , 2025 | 05:18 AM
ఓ ప్రముఖ సంస్థకు లాభం చేకూర్చేందుకు రూ.70లక్షలు డిమాండ్ చేసిన ఆదాయ పన్ను శాఖ కమిషనర్ లావుడ్యా జీవన్లాల్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది.

ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జీవన్లాల్ అరెస్టు
సీబీఐ అదుపులో ఆయనతోపాటు మరో నలుగురు
18చోట్ల సోదాలు.. రూ.1.39కోట్ల నగదు స్వాధీనం
హైదరాబాద్, మే 10 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రముఖ సంస్థకు లాభం చేకూర్చేందుకు రూ.70లక్షలు డిమాండ్ చేసిన ఆదాయ పన్ను శాఖ కమిషనర్ లావుడ్యా జీవన్లాల్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఆయనతోపాటు మరో నలుగురిని అరెస్టు చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడైన జీవన్లాల్.. 2004 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ హోదాలో ఉన్న ఆయన.. ఐటీ అప్పీల్ యూనిట్ 7, 8కు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే, కార్పొరేట్ సంస్థల అప్పీళ్లను పరిష్కరించేందుకు కొందరు మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయనపై ఫిర్యాదులు అందండంతో సీబీఐ రంగంలోకి దిగింది. ముంబైలో శుక్రవారం ఓ కంపెనీ ప్రతినిధుల నుంచి జీవన్లాల్కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి రూ.70లక్షల లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు పట్టుకున్నారు.
ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా.. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు జీవన్లాల్పై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. ముంబై, హైదరాబాద్, ఖమ్మం, ఢిల్లీ, విశాఖపట్నంలోని 18 ప్రాంతాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలతోపాటు రూ.69లక్షలను స్వాధీనం చేసుకున్నారు. జీవన్లాల్తోపాటు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న శ్రీకాకుళానికి చెందిన సాయి రాం పొలిశెట్టి, విశాఖకు చెందిన నట్టా వీరనాగ శ్రీరాంగోపాల్, షాపూర్జీ గ్రూపు డీజీఎం కాంతిలాల్ మెహతా, సాజిదా మజహర్ హుస్సేన్ షాను అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసిన నేపథ్యంలో ముంబై, విశాఖ, హైదరాబాద్లోని సీబీఐ కోర్టుల్లో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని అధికారులు వెల్లడించారు. లంచం డబ్బు, సోదాల్లో దొరికిన డబ్బు కలిపి మొత్తం రూ.1.39కోట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూపుకు సంబంధించిన కేసులో ఈ అరెస్టులు జరిగినట్లు తెలిసింది.