Hyderabad: అప్పీళ్లన్నీ ఆదాయ వనరులే
ABN , Publish Date - May 13 , 2025 | 03:46 AM
దేశంలోని ప్రముఖ నిర్మాణ, ఇంజనీరింగ్ సంస్థ షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి రూ.70 లక్షలు లంచం తీసుకున్న అభియోగంపై అరెస్టయిన ఆదాయ పన్ను కమిషనర్ లావుడ్య జీవన్లాల్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఒక్కో దానికి రూ.15-20 లక్షలు లంచం
బినామీలు, హవాలా ఖాతాల్లోకి మళ్లింపు
ముంబై సంస్థ నుంచి 2.5 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్
ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జీవన్లాల్ అవినీతి బాగోతం
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రముఖ నిర్మాణ, ఇంజనీరింగ్ సంస్థ షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి రూ.70 లక్షలు లంచం తీసుకున్న అభియోగంపై అరెస్టయిన ఆదాయ పన్ను కమిషనర్ లావుడ్య జీవన్లాల్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ కమిషనర్గా ఉన్న ఆయన ఐటీ అప్పీల్ యూనిట్ 7, 8కి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల అప్పీళ్లను పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని జీవన్లాల్ లంచాలు వసూలు చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. లంచంగా తీసుకున్న స్థిరాస్తులను బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను తన వద్ద భద్రపర్చుకున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ప్రాథమికంగా ఆయన అక్రమ సంపాదన రూ.కోట్లలో ఉన్నట్లు తేలగా.. తదుపరి దర్యాప్తులో అంతకు పదింతలు ఎక్కువ తేలే అవకాశం ఉన్నట్లు సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల స్థాయిని బట్టి కనీసం రూ.15 లక్షలు, రూ.20 లక్షల నుంచి రూ.కోట్లు లంచం తీసుకుని, అప్పీళ్లను పరిష్కరించినట్లు సీబీఐ విచారణలో తేలింది. ఈ క్రమంలోనే ముంబైలో ఎన్డీడబ్ల్యూ డెవల్పమెంట్ కార్పొరేషన్ ఎల్ఎల్పీకి సంబంధించిన అప్పీలుకు ఏకంగా రూ.2.5 కోట్ల విలువైన ఫ్లాట్ లంచంగా తీసుకున్నట్లు తేలింది.
ఈ ఫ్లాట్ను ఖమ్మంకు చెందిన దండెల వెంకటేశ్వర్లు పేరిట రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలను జీవన్లాల్ వద్ద ఉంచుకున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ముంబైకి చెందిన వెంచూరా సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేసి, రూ.15 లక్షలు మధ్యవర్తి వెంకటేశ్వర్లు ద్వారా తీసుకున్నట్లు వెల్లడైంది. అహ్మదాబాద్కు చెందిన హేమంత్ కుమార్, రాజేంద్ర కుమార్ షా నుంచి రూ.15 లక్షలు వసూలు చేసి హవాలా మార్గంలో తన వారి ఖాతాలో జమచేయించినట్లు సీబీఐ గుర్తించింది. తాజాగా ముంబైకి చెందిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఓ అప్పీలు విషయంలో రూ.కోటీ 20 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అందులో రూ.15 లక్షలు ముంబైకి చెందిన సాజీదా మజహర్ హుస్సేన్ షాను మధ్యవర్తిగా ఉంచి తీసుకున్నారు. ఆ మొత్తం జీవన్లాల్ ఆదేశాల మేరకు వరహాలు అనే వ్యక్తి ఖాతాలో జమచేశారు. మరో రూ.70 లక్షలు మధ్యవర్తి రాంగోపాల్ ద్వారా జీవన్లాల్కు చేరాల్సి ఉంది. డబ్బులు చేతులు మారేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పక్కా సమాచారంతో సీబీఐ ప్రత్యేక బృందం జీవన్లాల్ను అరెస్ట్ చేసింది. లంచం డబ్బులు వసూలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన మధ్యవర్తులు, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న బినామీలు, ఓ చార్టర్డ్ అకౌంటెట్పై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
For More AP News and Telugu News