IIT Hyderabad: వేణుగానామృతం.. సంగీత పరవశం
ABN , Publish Date - May 31 , 2025 | 04:10 AM
పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం, పద్మశ్రీ గ్రహీత విదుషి ఏ కన్యాకుమారి వయొలిన్ కచేరితో.. ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణం శుక్రవారం పరవశించిపోయింది.

ఐఐటీ హెచ్లో అలరించిన ‘స్పిక్ మైకే’ సదస్సు
కంది, మే 30 (ఆంధ్రజ్యోతి): పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం, పద్మశ్రీ గ్రహీత విదుషి ఏ కన్యాకుమారి వయొలిన్ కచేరితో.. ఐఐటీ హైదరాబాద్ ప్రాంగణం శుక్రవారం పరవశించిపోయింది. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హెచ్లో జరుగుతున్న స్పిక్ మైకే(సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్స్ట్ యూత్) అంతర్జాతీయ సదస్సు ఐదో రోజు, శుక్రవారం సంగీత ప్రయాణం శ్రావ్యమైన పాండిత్యం, మధురమైన పాటలు, నాట్యంతో రంజింపజేసింది.
విదుషి ఏ కన్యాకుమారి తన వయొలిన్ కచేరితో అలరించగా, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా మధురమైన వేణుగానంతో మైమరపింపజేశారు. విదుషి అశ్విని భిడే దేశ్పాండే హిందుస్థానీ గాత్ర పారాయణంతో ఆకట్టుకోగా, వార్సీ బ్రదర్స్ కచేరి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. భాయ్ గురుదేవ్ సింగ్ హజూరి రాగి - షాబాద్ కీర్తన, నీమ్రానా గాయక బృందం పవిత్ర సంగీతం, ఉస్తాద్ షాహిద్ పర్వేజ్ ఖాన్- సితార్, వెంకటేష్ కుమార్ హిందుస్థానీ గానం అలరించాయి.