Share News

Agriculture Research: ఎకరానికి 68 బస్తాలు!

ABN , Publish Date - May 03 , 2025 | 03:58 AM

శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఐఐఆర్‌ఆర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐఆర్‌ఆర్‌ చేపడుతున్న వరి పరిశోధనలు, నూతన వంగడాల రూపకల్పనల గురించి వీరు వివరించారు.

Agriculture Research: ఎకరానికి 68 బస్తాలు!

  • డీఆర్‌ఆర్‌ ధాన్‌-75 రకం వరి వంగడంతో రైతులకు అధిక దిగుబడి

  • ఈ రకానికి కంకికి 380-400 గింజలు

  • వచ్చే రెండేళ్లలో కంకికి వెయ్యి గింజలు పండే మరో రకమూ అందుబాటులోకి

  • అప్పుడు ఎకరానికి 144 బస్తాల దిగుబడి పరిశోధనల్లో ఐఐఆర్‌ఆర్‌ శాస్త్రవేత్తలు

రాజేంద్రనగర్‌, మే 2(ఆంధ్రజ్యోతి): ఎకరానికి 40-45 బస్తాల దిగుబడొస్తే రైతుకు తృప్తి! అదే ఎకరానికి ఏకంగా 68 బస్తాల దిగుబడొస్తే? ‘డీఆర్‌ఆర్‌ ధాన్‌-75’ అనే రకం వంగడంతో ఈ అద్భుతం సాధ్యం అంటోంది రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్‌)! ఇటీవ ల విడుదల చేసిన డీఆర్‌ఆర్‌ ధాన్‌-75 రకం వరి వంగడం (భాగ్యనగర్‌ సోనా)తో హెక్టారుకు 10 టన్నుల నుంచి 12 టన్నుల ధాన్యం దిగుబడి (ఎకరానికి 68 బస్తాలు-బస్తాకు 70కిలోలు) వస్తోందని ఐఐఆర్‌ఆర్‌ జెనిటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ విభాగం హెడ్‌ డాక్టర్‌ సాయు ప్రసాద్‌, సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌ అబ్దుల్‌ ఫియాజ్‌ తెలిపారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఐఐఆర్‌ఆర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐఆర్‌ఆర్‌ చేపడుతున్న వరి పరిశోధనలు, నూతన వంగడాల రూపకల్పనల గురించి వీరు వివరించారు. భారత్‌లో వరి వంగడాలు హెక్టారుకు 6 టన్నుల నుంచి 8 టన్నుల మేర దిగుబడి ఇస్తుండగా రాజేంద్రనగర్‌లోని ఐఐఆర్‌ఆర్‌కు చెందిన డైరెక్టర్‌ డాక్టర్‌ రామన్‌ మీనాక్షి సుందరం సహకారంతో ఇటీవల విడుదల చేసిన డీఆర్‌ఆర్‌ ధాన్‌-75 హెక్టారుకు 10 టన్నుల నుంచి 12 టన్నుల వరకు దిగుబడి ఇస్తోందని చెప్పారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్పత్తులు చేపట్టే విదంగా డీఆర్‌ఆర్‌ ధాన్‌-75ను రూపకల్పన చేసినట్లు తెలిపారు.


ఈ రకాన్ని 2024, అక్టోబరు 8న విడుదల చేశామని చెప్పారు. సాంబా మసూరిలాంటి రకానికి ఒక కంకికి 150 నుంచి 200 వరకు గింజలు వస్తాయని.. డీఆర్‌ఆర్‌ ధాన్‌-75 రకానికి 380 నుంచి 400 గింజలు వస్తున్నాయన్నారు. ఈ రకాన్ని తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, యూపీ, ఒడిసా, ఝార్ఖండ్‌, బిహార్‌, గుజరాత్‌, మహరాష్ట్రలోని 50మంది రైతులకు ఇచ్చి పండిస్తున్నామన్నారు. వారిలో ఇప్పటి వరకు ఐదుగురు హెక్టారుకు 10 టన్నుల నుంచి 12 టన్నుల దిగుబడి వచ్చిందని చెప్పారని వెల్లడించారు. పైగా ఇది అగ్గి తెగులు, ఎండాకు తెగులను తట్టుకునే రకం అని చెప్పారు. కాగా రానున్న రోజుల్లో ఒక కంకికి వెయ్యి గింజలు పండే విధంగా, అవన్నీ కూడా తాలు లేకుండా నాణ్యమైనవిగా ఉండేవిధంగా పరిశోదనలు జరుగుతున్నాయి. ఈ మేరకు ‘టార్గెట్‌ 1000’ పై తొమ్మిదేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయని డాక్టర్‌ సాయు ప్రసాద్‌, డాక్టర్‌ అబ్దుల్‌ ఫియాజ్‌ వెల్లడించారు.. ఇది మార్కెట్‌ లోకి రావడానికి మరో రెండేళ్లు పడుతుందన్నారు. టార్గెట్‌ 1000 రకాన్ని ఇటీవల ఐఐఆర్‌ఆర్‌ సందర్శించిన ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మంగీలాల్‌ జాట్‌కు చూపిస్తే శాస్త్రవేత్తలను భుజం తట్టి అభినందించారని చెప్పారు. త్వరలోనే ఈ రకం గురించి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రికి చూపించి వివరించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. టార్గెట్‌ 1000 రకం వరి వండగం విడుదలైతే వరి పరిశోధన, ఉత్పత్తుల్లో ఛైనాను అదిగిమిస్తామని చెప్పారు. ఈ రకం విడుదలైతే హెక్టారుకు 20 నుంచి 25 టన్నులు (ఎకరానికి 144 బస్తాలు) పండినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 03 , 2025 | 07:58 AM