SIT Inquiry: మరోసారి సిట్ ముందుకు ప్రణీత్ రావు
ABN , Publish Date - Jun 13 , 2025 | 03:25 PM
SIT Inquiry: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ప్రణీత్రావును ప్రశ్నించిన సిట్.. తాజాగా ఈరోజు మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్, జూన్ 13: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ఈరోజు (శుక్రవారం) ప్రణీత్ రావు (Praneeth Rao) సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. హార్డ్ డిస్క్ల ధ్వంసం అంశాలపైనే ప్రధానంగా ప్రణీత్ రావును సిట్ విచారించనుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Former SIB chief Prabhakar Rao) ఆదేశాలతోనే అంతా చేశామని గతంలో ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో నేటి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసుకు సంబంధించి గతంలోనే ప్రణీత్ రావును సిట్ అధికారులు పలుమార్లు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ప్రణీత్రావును ప్రశ్నించిన సిట్.. తాజాగా ఈరోజు మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నేడు ప్రణీత్ రావు సిట్ బృందం ముందు విచారణకు హాజరయ్యారు. హార్డ్ డిస్క్ల ధ్వంసంలోనూ, ఆధారాలు మాయం చేసిన అంశంలోనూ ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల రోజు రాత్రి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన పరికరాలను, హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. ఎస్ఐబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ ఆఫీస్లో హార్డ్ డిస్క్లను మొత్తం ధ్వంసం చేసి మూసీలో పడేశారు. ఇదే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మూసీ నదిలో నుంచి కొన్ని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణకు ప్రభాకర్ రావు సహకరించని పరిస్థితి. పోలీసులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు దాట వేసే ప్రయత్నమే చేస్తూ వచ్చారు. కిందిస్థాయి అధికారులు ఎవరికీ కూడా తాను ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇవ్వలేదని చెబుతున్నారు. కానీ ప్రణీత్ రావు సహా ఫోన్ ట్యాపింగ్లో అరెస్ట్ అయిన తిరుపతి రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు వీరంతా కూడా గతంలో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన సమయంలో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే పని చేశామని చెప్పుకొచ్చారు. అయితే వీరు ఇచ్చిన స్టేట్మెంట్ను ప్రభాకర్ రావు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రణీత్ రావును మరోసారి విచారించి స్టేట్మెంట్ను రికార్డు చేసే అవకాశం ఉంది. రేపు ప్రభాకర్ రావును మరోసారి విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
తల్లుల ఖాతాల్లోకి నిధులు.. ఆనందంలో కుటుంబాలు
పుట్టే బిడ్డపై ప్రాణాలు పెట్టుకున్న తండ్రి.. కుమారుడి మృతితో
Read Latest Telangana News And Telugu News