KCR: గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:09 PM
KCR Health Checkup: ఆరోగ్య పరీక్షల కోసం మాజీ సీఎం కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట కుటుంబసభ్యులు ఉన్నారు.

హైదరాబాద్, జూన్ 14: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి (AIG Hospital) వెళ్లారు. గత కొంత కాలంగా జలుబుతో బాధపడుతున్నారు మాజీ సీఎం. ఈ క్రమంలో ఆరోగ్య పరీక్షల కోసం ఈరోజు (శనివారం) ఉదయం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆయన వెంట కుటుంబసభ్యులు, మాజీ మంత్రి హరీష్ రావు, తదితరులు ఉన్నారు. నిన్ననే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న గులాబీ బాస్ ఈరోజు మరోసారి ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత నందీనగర్లోని నివాసానికి వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు నందీనగర్ నివాసంలో కేసీఆర్ ఉండనున్నారు.
ప్రతీ రెండు నెలలకు ఒకసారి కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. గతంలో యశోదా ఆస్పత్రికి కేసీఆర్ తరచుగా వెళ్తుండేవారు. అయితే ఈసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. నిన్న సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్లోని ఆయన నివాసం నుంచి హైదరాబాద్ వచ్చిన కేసీఆర్.. ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. మళ్లీ ఈరోజు కూడా రావాల్సిందిగా వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు నేడు ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
గడిచిన ఏడాదిన్నర కాలంగా కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్లోని ఆయన నివాసంలోనే ఉంటున్నారు. అందుబాటులో ఉండాలని వైద్యులు చెప్పిన నేపథ్యంలో బంజారాహిల్స్లోని నందినగర్లోనే ఉండనున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈనెల 11న మాజీ సీఎం హాజరైన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా తనకు జలుబు ఉందని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్కు చెప్పారు. ఓపెన్ కోర్టులో విచారణ వద్దని కేసీఆర్ కోరగా.. ఆయన వినతిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్ బహిరంగ విచారణను రద్దు చేశారు. ఇండోర్లోనే కేసీఆర్ను కమిషన్ ముఖాముఖిగా విచారించింది. ఇక అప్పటి నుంచి కూడా అనారోగ్యంతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో వైద్యపరీక్షల నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వెళ్లారు.
ఇవి కూడా చదవండి
జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. తాడిపత్రిలో ఏం జరుగుతోంది
మరోసారి సిట్ విచారణకు ప్రభాకర్ రావు
Read latest Telangana News And Telugu News