BJP Leaders: తక్కువ రేట్లకే భూములు ధారాదత్తం.. సర్కార్పై బీజేపీ నేతల ఫైర్
ABN , Publish Date - Dec 01 , 2025 | 01:26 PM
హిల్ట్కు వ్యతిరేకంగా ఈనెల 7న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టబోతున్నామని రామచందర్ రావు ప్రకటించారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు.
హైదారాబాద్, డిసెంబర్ 1: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ ఈరోజు (సోమవాం) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ నేతలు (BJP Leaders) కలిశారు. సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు (State BJP Chief Ramachandar Rao) మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇండస్ట్రియల్కు కేటాయించిన భూములను హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్గా మారుస్తూ కోట్ల రూపాయలు అవకతవకలకు తెర లేపుతున్నారని ఆరోపించారు. మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేట్లకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.
6 లక్షల 30 వేల కోట్ల విలువైన 9292 వేల ఎకరాల భూములను కేవలం 5 వేల కోట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా..? పరిపాలన చేస్తుందా.. అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టే ఇండస్ట్రియల్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి లబ్ధి పొందుతున్నారని వ్యాఖ్యలు చేశారు. హిల్ట్కు వ్యతిరేకంగా ఈనెల 7న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టబోతున్నామని ప్రకటించారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు వెల్లడించారు.
హిల్ట్పై గవర్నర్కు ఫిర్యాదు చేశామని.. ప్రభుత్వ వైఫల్యాను వ్యతిరేకంగా 7న నిరసన దీక్ష చేపట్టబోతున్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. కాగా.. రామచందర్ రావుతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ఇతర నేతలు గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు.