Share News

Hyderabad MLC Elections: ముగిసిన హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:18 AM

హైదరాబాద్‌ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 78% పోలింగ్‌ నమోదైంది. 112 ఓటర్లలో 88 మంది పోలింగ్‌లో పాల్గొనగా, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరూ ఓటు వేయలేదు. ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది.

Hyderabad MLC Elections: ముగిసిన హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు

78 శాతం పోలింగ్‌

  • 112 మందికి గాను ఓటేసిన 88 మంది

  • ఓటింగ్‌లో పాల్గొనని బీఆర్‌ఎస్‌

  • బరిలో బీజేపీ, మజ్లిస్‌ అభ్యర్థులు

  • రేపు ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 112 మంది ఓటర్లకుగాను 88 మంది ఓటు వేశారు. 78.57 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో) అనురాగ్‌ జయంతి తెలిపారు. మజ్లిస్‌ అభ్యర్థిగా మిర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ ఎఫెండి, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు బరిలో నిలిచారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటీకి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోగా.. పార్టీ నిర్ణయం మేరకు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు 24 మంది పోలింగ్‌లో పాల్గొనలేదు. మజ్లిస్‌ ప్రజాప్రతినిధులు 50 మంది; బీజేపీ నుంచి 24 మంది; కాంగ్రెస్‌ నుంచి 14 మంది ఓటు వేశారు. 31 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులకు గాను 22 మంది, 81 మంది కార్పొరేటర్లకుగాను 66 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.


ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవగా.. మధ్యాహ్నం 2 గంటలకల్లా 88 మందీ ఓటేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, లక్ష్మణ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ జీహెచ్‌ఎంసీ ఆఫీసులోని భవన నిర్వహణ విభాగం గదిలో ఉన్న పోలింగ్‌ కేంద్రంలో, కార్పొరేటర్లు లైబ్రరీ హాల్‌లోని కేంద్రంలో ఓటేశారు. పోలింగ్‌ ముగిశాక బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూంలో భద్రపర్చారు. 25న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కొందరు ఓటింగ్‌కు వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. ఎవరూ పోలింగ్‌లో పాల్గొనలేదు. ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక్కటేనని, మజ్లీస్ ను నిలువరించేది బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ అభ్యర్థి గౌతమ్‌రావు చెప్పారు.


ఇవి కూడా చదవండి

PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు

Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2025 | 04:18 AM