Share News

Asifabad: వేటగాళ్ల ఉచ్చుకు పెద్దపులి బలి

ABN , Publish Date - May 18 , 2025 | 04:58 AM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలంలోని ఎల్లూరు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిక్కి పెద్దపులి మృతి చెందింది.

Asifabad: వేటగాళ్ల ఉచ్చుకు పెద్దపులి బలి

  • చర్మం, గోళ్లను ఎత్తుకెళ్లిన దుండగులు.. ఆసిఫాబాద్‌లో దారుణం

కాగజ్‌నగర్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలంలోని ఎల్లూరు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు చిక్కి పెద్దపులి మృతి చెందింది. శనివారం కాగజ్‌నగర్‌ అటవీ డివిజనల్‌ కార్యాలయంలో ఫీల్డ్‌ డైరెక్టర్‌ ప్రాజెక్టు టైగర్‌(ఎ్‌ఫడీపీటీ) శాంతారాం కేసు వివరాలను వెల్లడించారు. పెంచికల్‌పేట అటవీ ప్రాంతం సమీపంలో తిరుగుతున్న పులి ఈ నెల 13 వరకు సీసీ కెమెరాలో రికార్డయింది. 14 నుంచి అది కనిపించకపోవడంతో అటవీ సిబ్బంది వాకబు చేశారు.


ఎల్లూరు అటవీ ప్రాంత సమీపంలో పులిని పాతి పెట్టినట్టు ప్రచారం కావటంతో అటవీ సిబ్బంది శుక్రవారం రాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ తవ్వి చూడగా ఏడేళ్ల వయసున్న ఆడ పులి కే-8 కళేబరం దొరికింది. అది వేటగాళ్లు అమర్చిన ఉచ్చుకు బలైనట్టు అటవీ సిబ్బంది నిర్ధారించారు. పులి చర్మం, గోళ్లను వేటగాళ్లు ఎత్తుకెళ్లారు. ఘటనపై అటవీ అధికారులతో పాటు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ(ఎన్టీసీఏ) బృంద సభ్యులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - May 18 , 2025 | 04:58 AM