Abandoned Parents: ఇల్లు పిల్లల పాలు.. కన్నవాళ్లు రోడ్లపాలు
ABN , Publish Date - May 14 , 2025 | 02:55 AM
నార్సింగ్కు చెందిన వృద్ధ దంపతులు కొమురయ్య, లక్ష్మమ్మను సంతానం ఇంట్లోంచి గెంటివేయడంతో వారు రోడ్లపై నివాసముంటున్నారు. సొంత ఇల్లు అమ్మేసి డబ్బులు పంచుకున్న పిల్లలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశారు.

నార్సింగ్, మే 13 (ఆంధ్రజ్యోతి): నవమాసాలు మోసి పెంచి పెద్ద చేశారు. కష్టపడి కూడబెట్టిన ఆస్తులిచ్చి పెళ్లిళ్లు చేశారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడాల్సిన సంతానం వారిని రోడ్డుపాలు చేసింది. దీంతో వారు రోడ్లపైనే కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. నార్సింగ్ గ్రామానికి చెందిన కొమురయ్య, లక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. నార్సింగ్లో సొంత ఇంటి ని పిల్లలంతా కలసి అమ్మేసి డబ్బులు పంచుకుని, తల్లిదండ్రులను ఇంట్లో నుంచి బయటకు గెంటివేశారని స్థానికులు పేర్కొన్నారు. దీంతో రెండ్రోజులుగా వీరిద్దరూ ఫుట్పాత్పైనే పడుకుంటున్నారు. గుడి దగ్గర అడుక్కుని తినాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఫోన్లుచేస్తే ఎవరూ స్పందించడం లేదని లక్ష్మమ్మ వాపోయారు. వారి దుర్భర పరిస్థితిని ఫొటోలు, వీడియోల రూపంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పలు వాట్సప్ గ్రూప్లలో పోస్టు చేశారు. వారికి తగిన న్యాయం చేయాలని మాజీ కౌన్సిలర్ ఉషారాణి నార్సింగ్ ఆర్డీవోకి ఫిర్యాదును అందజేశారు.