High Court Orders: సిగాచీ పేలుడు ఘటనపై సమగ్ర వివరాలివ్వండి
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:37 AM
సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో సమగ్రమైన

ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?: హైకోర్టు
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో సమగ్రమైన కౌంటర్ దాఖలు చేయాలని చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చురుగ్గా సాగడం లేదని, బాధిత కుటుంబాలకు పరిహారం అందించడంలో జాప్యం చోటుచేసుకుంటోందని పేర్కొంటూ విశ్రాంత శాస్త్రవేత్త కే బాబూరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ గౌస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపిస్తూ బాఽధిత కార్మికుల్లో ఎక్కువశాతం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వలస కార్మికులని, ఇంకా పూర్తిగా పరిహారం చెల్లించలేదని తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. పేలుడు ఘటనపై ఏయే సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పటివరకు ఏమైనా అరెస్టులు చేశారా? అని ప్రశ్నించింది. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇస్తూ ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు చేయలేదని పేర్కొన్నారు. హైలెవల్ కమిటీ, నిపుణుల కమిటీ నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని నివేదించారు. ఈ సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. పోలీసుల దర్యాప్తునకు కమిటీల నివేదికలకు సంబంధం ఉందా అని ప్రశ్నించింది. ప్రస్తుత పిటిషన్ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంగా భావించరాదని స్పష్టంచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News