Group-1: జాప్యం వద్దు.. నియామక పత్రాలు ఇవ్వండి
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:41 AM
గ్రూప్-1కు ఎంపికైన వారికి జాప్యం చేయకుండా నియామకపత్రాలు అందించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వానికి గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థుల విజ్ఞప్తి
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1కు ఎంపికైన వారికి జాప్యం చేయకుండా నియామకపత్రాలు అందించాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. మూడేళ్ల క్రితం గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎంతో కష్టించామని, రెండు సార్లు పరీక్షల రద్దు, మళ్లీ నిర్వహణ తర్వాత ఎట్టకేలకు తుది జాబితా విడుదలైనా నియామక ప్రక్రియ పూర్తికావడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1 పోస్టులకు ఎంపికైనవారు ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత కొందరు ఉద్దేశపూర్వకంగా కోర్టులో కేసులు వేసి కావాలని అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నియామక ప్రక్రియలో జాప్యం జరిగితే గ్రూప్-2, గ్రూప్-3 పోస్టుల భర్తీపైనా ప్రభావం పడుతుందని, బ్యాక్లాగ్ పోస్టులు పెద్దసంఖ్యలో మిగిలిపోతాయన్నారు. పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తి పారదర్శకతతో నిర్వహించిందని, ఎలాంటి అవకతవకలు, అక్రమాలకు అవకాశమే లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నియామకపత్రాలు అందించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.