Tummala: రాష్ట్రవ్యాప్తంగా 15 బయో గ్యాస్ ప్లాంట్లు
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:02 AM
రాష్ట్రవ్యాప్తంగా 15 బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ‘జీపీఎస్ రెనోవేబుల్ ఆర్య’ సంస్థ ముందుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఏటా 82,125 టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి
జీపీఎస్ రెనోవేబుల్ ఆర్య సంస్థ ప్రతిపాదన
3 వేల మందికి ఉపాధి : తుమ్మల
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 15 బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ‘జీపీఎస్ రెనోవేబుల్ ఆర్య’ సంస్థ ముందుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో గురువారం మంత్రి తుమ్మలతో జీపీఎస్ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రాజెక్టు నివేదికను మంత్రికి సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, వనపర్తి, మహబూబ్నగర్, కామారెడ్డి, నిజామాబాద్లో కంప్రె్సడ్ బయోగ్యాస్ ప్లాంట్లు (సీబీజీ ప్లాంట్లు) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్లాంట్ల ద్వారా 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఒక్కో ప్లాంటు రోజు వారీ ఉత్పత్తి సామర్థ్యం 15టన్నులు కాగా, 15 ప్లాంట్ల ద్వారా ఏడాదికి 82,125 టన్నుల కంప్రె్సడ్ బయోగ్యాస్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇది సుమారు 57.84 లక్షల గృహ వినియోగ సిలిండర్లకు సమానమని తెలిపారు. ప్రతి ప్లాంటుకు 45 ఎకరాల స్థలం అవసరమవుతుందని, ఏడాదిన్నరలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు వెల్లడించారు.