TG Government: ఆరుగురు అధికారులతో కమిటీ
ABN , Publish Date - May 21 , 2025 | 05:08 AM
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేసింది. ఫోరెన్సిక్ బృందం సేకరించిన నమూనాలతో లోతైన దర్యాప్తు జరుగుతున్నది, టెర్రస్ పైన ఉన్న కార్మికులు సురక్షితంగా ఉన్నారు.

‘గుల్జార్ హౌజ్’ అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన సర్కారు
సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం
శాంపిల్స్ సేకరించిన ఫోరెన్సిక్ బృందం
అగ్ని ప్రమాదర జరిగిన తీరుపై లోతైన దర్యాప్తు
టెర్రస్ పైన ఉన్న నలుగురు కార్మికులు సురక్షితం
నేడు కార్మికులు, మృతుల కుటుంబ సభ్యులను విచారించనున్న చార్మినార్ పోలీసులు
దేశంలోనే అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నాం
అసత్య ఆరోపణలు సరికాదు: అగ్నిమాపక శాఖ
హైదరాబాద్ సిటీ/చార్మినార్, మే 20 (ఆంధ్రజ్యోతి): గుల్జార్ హౌజ్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. ప్రమాదంలో 8 మంది చిన్నారులు సహా 17 మంది మరణించిన సంగతి తెలిసిందే. మంటలు వ్యాపించడానికి కారణమేంటి? పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడానికి కారణాలు ఏంటి? అనే అంశాలపై స్థానికులు, అధికారులు, నాయకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ వేసినట్లు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రకటించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీఎ్సఎస్పీడీసీఎల్ సీఎండీ ముషార్ఫతో కమిటీని వేసినట్లు తెలిపారు. పెద్దపెద్ద అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలతోపాటు నష్టాన్ని తగ్గించడంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిందిగా కమిటీని ఆదేశించినట్లు సమాచారం.
నమూనాలు సేకరించిన ఫోరెన్సిక్ బృందం..
ప్రమాదం జరిగిన ఇంట్లో మంగళవారం ఫోరెన్సిక్, క్లూస్ టీమ్ అధికారులు మృతుల బంధువుల సమక్షంలో 3 గంటల పాటు తనిఖీలు చేశారు. ఇంటి లోపలికి వెళ్లే ప్రధానమార్గం మొదలుకొని లోపలున్నకొద్దిపాటి పార్కింగ్ స్థలం, అక్కడి మెట్లమార్గం, ఇంట్లోని గదులను పరిశీలించారు. పేలిపోయిన ఏసీ కంప్రెషర్ ముక్కలు, కాలిపోయిన ఇతర వస్తువుల నమూనాలను సేకరించారు. ప్రమాదం కారణంగా ఇంటి గోడలు బీటలు వారినట్లు గుర్తించారు. భవనంలో 14 ఏసీలు ఉన్నట్లు గుర్తించారు. బయటకు వెళ్లేందుకు ఒక్కటే మార్గం ఉండడం వల్లే ప్రమాద సమయంలో తప్పించుకునే వీల్లేకుండా పోయినట్లు పేర్కొన్నారు. ఓవర్ లోడ్ వల్ల విద్యుత్తు మీటర్లలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి, క్రమంగా ఏసీలకు పాకడంతో దారుణం జరిగి ఉండొచ్చనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. మెట్ల వద్ద పార్క్ చేసిన బైకులకు మంటలు అంటుకున్నాయని, వాటిలోని పెట్రోల్ కారణంగా మంటల తీవ్రత పెరిగి ఉంటుందని, అలాగే వాహనాల సీట్ల కవర్లు కాలిపోయి దట్టమైన పొగలు వ్యాపించాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇంటి బయటి ద్వారం కూడా షట్టర్ కావడంతో పొగ పై అంతస్తులకు వేగంగా వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ఉన్నతస్థాయి అధికారుల కమిటీతో సమన్వయం చేసుకుంటూ విచారణ కొనసాగిస్తామని చార్మినార్ పోలీసులు తెలిపారు. మొదటి, రెండో అంతస్తులకు మంటలు, పొగలు వ్యాపించిన క్రమంలో బాధితులు టెర్రస్ పైకి వెళ్లడానికి ప్రయత్నించగా దానికి తాళం వేసినట్లు దర్యాప్తులో తేలింది. టెర్రస్ పైన ఉన్న నలుగురు కార్మికులు సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గుల్జార్ హౌజ్ ప్రాంతంలో భవనాలన్నీ అతుక్కొని ఉండడంతో దొంగలు సులభంగా చోరీలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దీంతో రోజూ దుకాణాల్లో పనిచేసే కార్మికులు టెర్ర్సపైన పడుకునేటప్పుడు మెట్ల మార్గానికి తాళం వేస్తారని గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన కార్మికులు మృతుల కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. బుధవారం ఆ నలుగురితో పాటు మృతుల కుటుంబ సభ్యులను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.
అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాం: అధికారులు
మృతుల బంధువులు చేసిన ఆరోపణలను అగ్నిమాపక శాఖ అఽధికారులు ఖండించారు. తెలంగాణ అగ్నిమాపక శాఖ దేశంలోనే అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోందని తెలిపారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఫైరింజన్లలో నీరు లేదన్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఫైరింజన్లో 4500 లీటర్ల నీటిని నిల్వ చేస్తారని, సాధారణ పీడనం వద్ద జెట్స్ను వాడినప్పుడు ట్యాంకు ఖాళీ అవడానికి 20 నిమిషాలు పడుతుందని, పరిస్థితి తీవ్రతను బట్టి అధిక పీడనంతో రెండు జెట్స్ వాడితే నీరు 10 నిమిషాల్లోనే అయిపోతుందని వివరించారు. ఈ విషయం తెలియని వారు ఫైరింజన్లో నీళ్లు లేవని ఆరోపిస్తారని చెప్పారు.