Share News

Food Poisoning: 111 మంది విద్యార్థినులకు అస్వస్థత కలుషిత ఆహారమే కారణం

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:02 AM

నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 111 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

Food Poisoning: 111 మంది విద్యార్థినులకు అస్వస్థత కలుషిత ఆహారమే కారణం

  • ఆస్పత్రిలో చికిత్స.. అనంతరం డిశ్చార్జి

  • పాఠశాల క్యాటరింగ్‌ కాంట్రాక్టు రద్దు

నాగర్‌కర్నూల్‌/హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 111 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో శనివారం రాత్రి భోజనం తర్వాత విద్యార్థినులకు కడుపునొప్పితో వాంతులు, విరేచనాలు కావడంతో ప్రిన్సిపాల్‌ లలిత, ఉపాధ్యాయులు వెంటనే వారిని చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం విద్యార్థునుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ముగ్గురు విద్యార్థినులు మినహా అందరినీ డిశ్చార్జి చేశామని డాక్టర్‌ పూర్ణిమ తెలిపారు. పరీక్షల నిమి త్తం విద్యార్థినులకు అందించిన ఆహార నమూనాలను జిల్లా వైద్యాధికారులు సేకరించారు. ఘటనకు బాఽధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా క్యాటరింగ్‌ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.


విద్యార్థుల భవిష్యత్తు మా బాధ్యత: మంత్రి జూపల్లి

నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధినులను మంత్రి జూపల్లి కృష్ణారావు కూచకుళ్ల రాజేశ్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి: హరీశ్‌

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక దాదాపు 100 మంది గురుకుల పాఠశాలల విద్యార్థులు అనారోగ్య కారణాలతో మృతి చెందారని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఘటనకు సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గురుకుల పాఠశాలలో అసౌకర్యాలపై మానవ హక్కుల కమిషన్‌ స్పందించాలని, హైకోర్టు ఈ సంఘటనను సుమోటాగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 04:02 AM