Fake Cotton Seeds: 40 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
ABN , Publish Date - May 17 , 2025 | 04:20 AM
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని అంగడిరైచూర్లో 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు.

కొడంగల్, మే 16 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని అంగడిరైచూర్లో 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీనివాస్ శుక్రవారం దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వ్యవసాయ శాఖ అధికారి తులసి, ఎస్సై జీవీ సత్యనారాయణ పోలీసు సిబ్బందితో కలిసి అంగడిరైచూర్ గ్రామంలో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో గ్రామానికి చెందిన మల్లారి పెద్ద మల్లప్ప ఇంట్లో 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. మల్లప్పను విచారించగా కర్ణాటకకు చెందిన ఎర్రప్పనేని కొండప్ప నాయుడు, మంగలి వెంకటయ్య నుంచి విత్తనాలు కొనుగోలు చేసినట్లు తెలిపాడు. పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాల విలువ దాదాపు రూ.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు.