Share News

Yadagirigutta: ‘గుట్ట’ దేవస్థానంలో చింతపండు దొంగలు

ABN , Publish Date - May 29 , 2025 | 05:10 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రసాదాల తయారీకేంద్రంలో చింతపండు దొంగిలించేందుకు విఫలయత్నం చేశారు..

Yadagirigutta: ‘గుట్ట’ దేవస్థానంలో చింతపండు దొంగలు

  • దాదాపు రూ.45 వేల విలువైన 10 సంచుల చోరీకి విఫలయత్నం

  • పట్టుబడిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

యాదగిరిగుట్ట, మే 28 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ప్రసాదాల తయారీకేంద్రంలో చింతపండు దొంగిలించేందుకు విఫలయత్నం చేశారు.. మంగళవారం అర్ధరాత్రి సంచులను కారులో తరలించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్లకు చెందిన పార్వతి మధు, రాజాపేట మండలం బేగంపేటకు చెందిన చెడదీప్‌ గణేశ్‌లు యాదగిరిగుట్ట దేవస్థానంలో సురక్ష అనే ఏజెన్సీ ద్వారా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఏడాదిగా పనిచేస్తున్నారు. గణేశ్‌ పులిహోర మిషన్‌ ఆపరేటర్‌గా, మధు క్లీనింగ్‌ విభాగంలో నెలకు రూ.15,600 వేతనానికి పనిచేస్తున్నారు.


మంగళవారం అర్ధరాత్రి దాటాక 2:25 గంటలకు ప్రసాదాల తయారీ కేంద్రానికి సామగ్రిని తరలించే కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా రూ.45వేల విలువైన 10 చింతపండు సంచులను (ఒక్కో బస్తా 30 కిలోలు) తరలించేందుకు గణేశ్‌, మధులు యత్నిస్తుండగా పెట్రోలింగ్‌ పోలీసులొచ్చారు. దీంతో గణేశ్‌, మధు పరారయ్యారు. గమనించిన పెట్రోలింగ్‌ పోలీసులు ఎస్పీఎఫ్‌ ఎస్‌ఐ సీతారాములు, ఏఎ్‌సఐ మాణిక్‌ప్రభుకు సమాచారం అందించగా ప్రసాదాల కౌంటర్‌ వద్ద ఆ వారిద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు పట్టుకున్నారు. తాము సురక్ష ఏజెన్సీ నుంచి ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఆలయంలో పనిచేస్తున్నామని, తమకు వేతనాలు ఇవ్వకపోవడంతో దొంగతనం చేసినట్లు చెప్పారు. ఘటనపై డీఈవో భాస్కరశర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణేశ్‌, మధులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్‌ తెలిపారు. గణేశ్‌, మధును విధుల నుంచి తొలగించామని, వారికి ఇప్పటికే వేతనాలు చెల్లించామని ఏజెన్సీ నిర్వాహకులు తెలిపారు.


Also Read:

వావ్.. రైలు పట్టాల మీద జేసీబీ

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే

For More Telangana News and Telugu News..

Updated Date - May 30 , 2025 | 02:58 PM