Share News

కుటుంబంతో ఉన్నా.. ‘ఒంటరి’ వేదన!

ABN , Publish Date - Jun 14 , 2025 | 04:06 AM

ఆధునిక యుగంలో వృద్ధులను ఒంటరితనం భావన వేధిస్తోంది. వారి భావోద్వేగాలకు, యువతరం అవగాహనకు మధ్య అంతరంతో.. మానసిక అనుబంధం కరువు అవుతోంది.

కుటుంబంతో ఉన్నా.. ‘ఒంటరి’ వేదన!

  • తమను సరిగా పట్టించుకోవడంలేదనే బాధలో వృద్ధులు

  • ప్రతికూల భావాలతో సతమతం అవుతున్న 54 శాతం మంది

  • ‘హెల్ప్‌ఏజ్‌ ఇండియా’ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఆధునిక యుగంలో వృద్ధులను ఒంటరితనం భావన వేధిస్తోంది. వారి భావోద్వేగాలకు, యువతరం అవగాహనకు మధ్య అంతరంతో.. మానసిక అనుబంధం కరువు అవుతోంది. కుటుంబంతోనే కలిసి ఉంటున్నా.. ఇంట్లో ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదంటూ మలి వయసువారు కుంగుబాటుకు లోనవుతున్నారు. భారత్‌లో దాదాపు 54 శాతం మంది ఇలా వృద్ధాప్యంలో ప్రతికూల భావాలతో సతమతం అవుతున్నారని, ముఖ్యంగా 47శాతం మంది ‘ఒంటరి’ భావన వేధిస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘అండర్‌ స్టాండింగ్‌ ఇంటర్‌జనరేషనల్‌ డైనమిక్స్‌ అండ్‌ పర్సెప్షన్స్‌ ఆన్‌ ఏజింగ్‌’ పేరిట ఈ అధ్యయన నివేదికను హెల్ప్‌ఏజ్‌ ఇండియా సంస్థ శుక్రవారం విడుదల చేసింది. జూన్‌ 15న ప్రపంచ వృద్ధుల వేధింపులపై అవగాహన దినోత్సవం నేపథ్యంలో.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, అహ్మదాబాద్‌, కాన్పూర్‌, మదురై, నాగ్‌పూర్‌ పట్టణాల్లో 5,798 మంది (70 శాతం 18-30 ఏళ్ల మధ్య వయస్కులు, 30 శాతం 60 ఏళ్లు పైబడిన వృద్ధులు)ని ప్రశ్నించి ఈ నివేదిక రూపొందించినట్టు తెలిపింది.


కలిసి భోజనం చేస్తున్నా, తరచూ మాట్లాడుకుంటున్నా కూడా.. వృద్ధుల భావోద్వేగాలకు, యువత అవగాహనకు మధ్య తీవ్ర అంతరం నెలకొందని పేర్కొంది. పట్టణాల్లో వృద్ధుల్లో ఒంటరితనం భావన ఎక్కువగా ఉందని, సరైన గౌరవం దక్కడం లేదనే ఆలోచనలతో ఉన్నారని వెల్లడించింది. నేటి డిజిటల్‌ యుగంలో కమ్యూనికేషన్‌ టెక్నాలజీలు కూడా ఈ సమస్యకు దారితీస్తున్నాయని తెలిపింది.71ు వృద్ధులు ఇప్పటికీ సాధారణ మొబైల్స్‌నే వాడుతున్నారని, కొత్త టెక్నాలజీలతో గందరగోళం పడుతున్నారని పేర్కొంది. స్మార్ట్‌ ఫోన్లు వంటివాటి వినియోగాన్ని నేర్పించడంలో యువత తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండటంతో పెద్ద వయసువారు బాధకు లోనవుతున్నారని వివరించింది. అయితే పెద్దల పట్ల నేటి యువతకు గౌరవం ఉందని, వారి పట్ల బాధ్యతతో మెలగాలని 76 శాతం మంది యువత కోరుకుంటున్నారని వెల్లడించింది. మరోవైపు యువత తమతో గడిపే సమయం ఆనందదాయకంగా ఉన్నా.. తాము చెప్పేది వినిపించుకోరని, తమ సలహాలను ఏమాత్రం పాటించడం లేదని వృద్ధులు నిట్టూరుస్తున్నారని తెలిపింది. వృద్ధులకు, యువతరానికి మధ్య పెరిగిపోతున్నఅంతరాన్ని పూడ్చేందుకు వెంటనే ప్రయత్నాలు ప్రారంభం కావాల్సి ఉందని నివేదిక పేర్కొంది.


తరాల మధ్య బంధాలను బలోపేతం చేయాలి

వయోవృద్ధుల సూచనలు యువతకు మేలుచేస్తాయని, కుటుంబాల్లో తరాల మధ్య బంధాలను బలోపేతం చేస్తేసమాజానికి మంచిదని పలువురు సామాజిక కార్యకర్తలు, వక్తలు అభిప్రాయపడ్డారు. హెల్ప్‌ ఏజ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ‘అంతర్జాతీయ వయో వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం’ సదస్సు నిర్వహించి, అధ్యయన నివేదికను విడుదల చేశారు. చర్చాగోష్ఠిలో ప్రొఫెసర్‌ ఆర్కే మూర్తి, సామాజిక కార్యకర్త దామోదర్‌, జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌ లీడర్‌ సాయిశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!

గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 04:06 AM