Telugu First: ప్రథమ భాషగా తెలుగును బోధించాలి
ABN , Publish Date - May 04 , 2025 | 03:58 AM
తెలుగు మాధ్యమ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో బోనస్ మార్కులు ఇవ్వాలని, ప్రథమ భాషగా తెలుగును అన్ని స్థాయిల విద్యలో బోధించాలని భాషాభిమానులు డిమాండ్ చేశారు.

తెలుగు మాధ్యమ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో బోనస్ మార్కులు ఇవ్వాలి
ప్రాచ్య కళాశాలలను ఏర్పాటు చేయాలి
తెలంగాణ తెలుగు భాషాభిమానుల డిమాండ్
హైదరాబాద్ సిటీ, మే 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ఒకటో తరగతి నుంచి వృత్తి విద్యా కోర్సులతో సహా ఉన్నత విద్య వరకు తెలుగును ప్రథమ భాషగా బోధించాలని వక్తలు డిమాండ్ చేశారు. తెలుగు మాధ్యమ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో బోనస్ మార్కుల విధానం తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పది ఉమ్మ డి జిల్లాల్లో ప్రాచ్య కళాశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. పౌర సమాజం నుంచి నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వి తీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించిందే కానీ ఉత్తర్వుల రూపంలో కళాశాలలకు పంపలేదని ఆక్షేపించారు. ‘తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు అవమానం ఎందుకు? ద్వితీయ భాషగానూ తెలుగును తొలగిస్తారా? ఏం జరుగుతోంది? ఏం జరగాలి’ అంటూ తెలంగాణ, తెలుగు భాషాభిమానులు శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమాలోచన సభ నిర్వహించారు.
ముఖ్య వక్తగా పాల్గొన్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ఆత్మాభిమానం కలిగిన ఏ సమాజమైనా మాతృభాషను చంపుకోదని అన్నారు. ఇంటర్లో విద్యార్థులకు అక్కరకు రాని సంస్కృతానికి బదులు తెలుగుకే ఎక్కువ మార్కు లు వేయొచ్చు కదా అని సూచించారు. సంస్కృతాన్ని ఇంగ్లిషు, తెలుగులో రాయడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ కొంతమంది తెలుగేతర ప్రభుత్వ ఉన్నతాధికారుల చర్యల వల్ల మాతృభాషకు తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. వారే దుర్మార్గ జీవోలతో తెలుగును తుడిచిపెట్టే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగు వద్దు అని ర్యాలీలు, నిరసనలు చేయిస్తున్న స్థానికేతరులు వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలన్నారు. చినజీయర్ జోక్యంవల్లే ఇంటర్ వరకు తప్పనిసరి తెలుగు అమలు నిర్ణయాన్ని గత సీఎం కేసీఆర్ వెనక్కితీసుకున్నారని చెప్పారు. మాతృభాష మార్కుల కోసమా, మానవ సంబంధాల కోసమా? అని ఆయన ప్రశ్నించారు.
సీనియర్ ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక అవసరాల రీత్యా తెలుగుకు చాలామంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. అందుకు తగినట్టు భాషాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఇంటర్ వరకు వ్యవహారిక తెలుగు బోధనను తప్పనిసరి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ మన మాతృభాషపై ఇంగ్లిషు, హిందీ, సంస్కృత భాషల ఆధిపత్యాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వలసవాద వ్యతిరేక పోరాటం లోతుగా సాగకపోవడం వల్ల భాష, సంస్కృతుల పరిరక్షణలో మనం ఇంకా సామ్రాజ్యవాద దృక్పథంతోనే ఆలోచిస్తున్నామని సామాజిక వేత్త ఆచార్య హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సారస్వత పరిషత్ విశ్రాంత అధ్యాపకుడు మోత్కూరి నరహరి సభాధ్యక్షత జరిగిన కార్యక్రమంలో హెచ్సీయూ తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమెస్కో చంద్రశేఖర్రెడ్డి, కవి యా కూబ్, పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచారితో పాటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, కవులు, రచయితలు పెద్దసంఖ్యలో పాల్గొని తెలుగును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పాత ప్రాచ్య కళాశాలలను పునరుద్ధరించాలని, తెలుగు పండిత శిక్షణ కళాశాలలను ఏర్పాటు చేయాలని తదితర తీర్మానాలను ఆమోదించారు.
ఇవి కూడా చదవండి
Robbery: ఇళ్లు అద్దెకు కావాలంటూ వచ్చి..ఏం చేశారంటే
Pakistan Ceasefire: కశ్మీర్లో మళ్లీ కాల్పులు..తొమ్మిదోసారి ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్
Read Latest Telangana News And Telugu News