Nirmal: బాసర ఆర్జీయూకేటీ అడ్మిషన్లలో జాప్యం
ABN , Publish Date - May 26 , 2025 | 04:48 AM
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

టెన్త్ ఫలితాలు వచ్చినా వెలువడని నోటిఫికేషన్
బాసర, మే25(ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పదవ తరగతిలో వచ్చిన మార్కులు, గ్రేడ్ల ఆధారంగా నేరుగా ఆర్జీయూకేటీలో ప్రవేశం కల్పిస్తుండగా ఫలితాల కంటే ముందుగానే ప్రతీసారి నోటిఫికేషన్ విడుదల అయ్యేది. హాల్టికెట్ నెంబర్తో దరఖాస్తులు తీసుకొని ఫలితాల జాబితాతో పోల్చి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత ఏడాది లాగే ఈ సారి కూడా అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో మార్చి, ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్స్ ఇచ్చి, జూన్లో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి జూలైలో తరగతులు ప్రారంభించేవారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం వల్లే ఆలస్యమవుతోందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.