Damodara Rajanarsimha: పభుత్వ ఆస్పత్రుల్లో కరెంటు కోతలుండొద్దు
ABN , Publish Date - Jun 05 , 2025 | 02:49 AM
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలకు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు.

ఆటోమేటెడ్ జనరేటర్లను ఏర్పాటు చేసుకోవాలి: దామోదర
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలకు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు. బుధవారం సచివాలయంలో వైద్య, విద్యుత్ శాఖల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఉన్న విద్యుత్ ఉత్పత్తి జనరేటర్ల పనితీరు, వాటి సామర్థ్యంపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా జనరేటర్ సౌకర్యం లేని ఆస్పత్రుల్లో ఆటోమేటెడ్ జనరేటర్లను సమకూర్చుకోవాలని ఆదేశించారు.
ఆస్పత్రుల్లో విద్యుత్ నిర్వహణ కోసం తాత్కాలిక పద్థతిలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లను నియమించుకోవాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధుల నిర్మూలనకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21)ను పురస్కరించుకొనిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా-2025’ పై రూపొందించిన వాల్ పోస్టర్ను మంత్రి దామోదర ఆ శాఖ డైరెక్టర్ హైమావతితో కలిసి ఆవిష్కరించారు.