Share News

Rythu Nestham: 16న రైతులతో సీఎం ముఖాముఖి

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:20 AM

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.

Rythu Nestham: 16న రైతులతో సీఎం ముఖాముఖి

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడతారని, ఆ ప్రసారాన్ని అన్ని రైతు నేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సీఎస్‌ తెలిపారు. ప్రతి ప్రాంతం నుంచి కనీసం 250 మంది రైతులు వారి రైతు నేస్తం కేంద్రానికి హాజరయ్యేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. కాగా, అంతకుముందు సీఎస్‌ శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే గద్దర్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను సమీక్షించారు.


సీఎం రేవంత్‌ను కలిసిన మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు

మంత్రివర్గంలోకి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను తీసుకోవడంపై మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎంను ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య తదితరులు కలిశారు. అంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌, వాకిటి శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు.


సీఎం సీపీఆర్వో బాధ్యతల స్వీకరణ

సీఎం రేవంత్‌రెడ్డి సీపీఆర్వోగా నియామకమైన గుర్రం మల్సూర్‌ శుక్రవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సీఎంను మల్సూర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - Jun 14 , 2025 | 03:20 AM