కర్రెగుట్టల్లో కాల్పులు నిలిపివేయాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 04:48 AM
ఛత్తీస్గఢ్ రిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్పై రాష్ట్రంలోని కమ్యూనిస్టులు, పౌరహక్కుల నేతలు, విద్యావేత్తల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి: కూనంనేని
అమాయక ఆదివాసీలే బలి
ప్రొఫెసర్ హరగోపాల్
దండకారణ్యంలో ఆదివాసీలపై యుద్ధం అప్రజాస్వామికం
వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఖమ్మంలో శాంతి ర్యాలీ
హైదరాబాద్, వడ్డెపల్లి, ఖమ్మం బైపాస్రోడ్ , ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్గఢ్ రిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్పై రాష్ట్రంలోని కమ్యూనిస్టులు, పౌరహక్కుల నేతలు, విద్యావేత్తల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులను వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు పదే పదే ప్రతిపాదిస్తున్నా.. కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహించడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. తక్షణమే కూంబింగ్ను నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కర్రెగుట్టల్లో పారామిలటరీ దళాలు జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని, మధ్య భారతంలో ఆదివాసీల హననాన్ని ఆపివేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర నేత, ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. హనుమకొండలో ఆయన మాట్లాడారు. మావోయిస్టులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటంలో అమాయక ఆదివాసీలే బలవుతున్నారని అన్నారు.
శాంతి అంటే శ్మశాన శాంతి కాదని, సజీవ శాంతిని సమాజం కోరుకుంటోందని అన్నారు. యుద్ధం, హింస లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలని, పౌరుల ప్రాణాలకు విలువ లేకుండా చేయడం అనాగరికమని హరగోపాల్ స్పష్టం చేశారు. కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఆదివాసీలతో భారత ప్రభుత్వం అంతర్యుద్ధం చేస్తోందని భారత్ బచావో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్ పేర్కొన్నారు. దేశపౌరులపై యుద్ధం చేయడం ప్రపంచంలో ఎక్కడా లేదని, దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైనికులు దండకారణ్యంలో ఆదివాసీలపై యుద్ధం చేయడం అప్రజాస్వామికమని ప్రముఖ విద్యావేత్త రవిమారుత్, సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. శనివారం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి పాత బస్టాండ్ వరకు శాంతి ప్రదర్శన నిర్వహించారు. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపకపోవడం వెనుక కార్పొరేట్ శక్తులు, బహుళజాతి కంపెనీలు ఉన్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ జనసమితి, బీఎస్పీ, తెలంగాణ పీపుల్ జేఏసీ, టీపీటీఎఫ్, జిల్లా విద్యావంతుల వేదిక, ఎస్ఎ్ఫఐ, ముస్లిం జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
Butta Renuka: ఆస్తుల వేలం.. వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్
Human Rights Demad: కాల్పులు నిలిపివేయండి.. బలగాలను వెనక్కి రప్పించండి.. పౌరహక్కుల నేతలు డిమాండ్
Read Latest Telangana News And Telugu News