పెండింగ్ బిల్లులు చెల్లించండి
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:04 AM
రోడ్లు, భవనాల శాఖ పరిధిలో చేపట్టిన పలు పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంట్రాక్టర్లు కొంతమంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.

మంత్రి కోమటిరెడ్డికి కాంట్రాక్టర్ల విజ్ఞప్తి
రోడ్లు, భవనాల శాఖ పరిధిలో చేపట్టిన పలు పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంట్రాక్టర్లు కొంతమంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టిన వార్షిక నిర్వహణ పనులను సమయానికి పూర్తిచేసినా.. బిల్లులు మాత్రం చెల్లించలేదని తెలిపారు. ఈ సందర్భంగా చిన్న కాంట్రాక్టర్లందరివి కలిపి రూ.122 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లిస్తే దాదాపు 2,500 బిల్లులు క్లియర్ అవుతాయని వివరించారు. దీనికి స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. బిల్లులకు సంబంధించిన టోకెన్ నెంబర్లను సీఎం రేవంత్, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు నివేదించి వాటి చెల్లింపునకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి తెలిపారు.
‘తెలంగాణ రైజింగ్’ లోగో ఆవిష్కరణ
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ కేంద్ర కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘తెలంగాణ రైజింగ్’ లోగోను ఆవిష్కరించారు. ఈ లోగోను బోర్డు రూపంలో కాకుండా ప్రత్యేకంగా నాచుతో ఏర్పాటు చేయడం విశేషం.