Congress Protest: ‘చలో వేల్పూర్’లో తీవ్ర ఉద్రిక్తత
ABN , Publish Date - Jul 18 , 2025 | 03:46 AM
కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో వేల్పూర్ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు.. కాంగ్రెస్ నేత యత్నం.. అతడిపై బీఆర్ఎస్ దాడి
హామీలను ప్రశ్నిస్తే దాడులా..?: ప్రశాంత్రెడ్డి
నిజామాబాద్/హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో వేల్పూర్ కార్యక్రమం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కనువిప్పు పేరుతో ఈ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో గురువారం ఉదయం నుంచి పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అరెస్టు చేశారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు పోలీసుల కళ్లుగప్పి గ్రామంలోకి వచ్చేందుకు యత్నించగా అరెస్టు చేశారు. కొందరు మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డి ఇంటి వైపు వెళ్లేందుకు యత్నించగా వారిని అడ్డుకున్నారు.
ఎన్ఆర్ఐ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నంది దేవేందర్రెడ్డి.. ప్రశాంత్రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించగా గమనించిన బీఆర్ఎస్ నాయకులు అతడిపై దాడి చేశారు. కాగా, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే తన ఇంటిపై వరంగల్కు చెందిన నంది దేవేందర్రెడ్డి దాడి చేయడం సరికాదని ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇళ్లపై దాడి చేయడం కాదు.. ముఖ్యమంత్రిని ఒప్పించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రశాంత్రెడ్డి ఇంటిపై దాడిచేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే.. మాజీ మంత్రి ఇంటిపై దాడిచేయడం దుర్మార్గమని హరీశ్ రావు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి