Share News

CM Revanth Reddy: ఇష్టారీతిన ఫీజుల పెంపా?

ABN , Publish Date - Jun 14 , 2025 | 03:03 AM

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారీతిన ఫీజులు పెంచుకుంటూ పోతారా? అని ప్రశ్నించారు. అనేక ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఇప్పటికే ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఆయన..

CM Revanth Reddy: ఇష్టారీతిన ఫీజుల పెంపా?

  • ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఇప్పటికే ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయ్‌

  • ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారు

  • విద్యార్థులపై భారం పడకుండా చూడండి.. అధికారులతో సీఎం

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారీతిన ఫీజులు పెంచుకుంటూ పోతారా? అని ప్రశ్నించారు. అనేక ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఇప్పటికే ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయన్న ఆయన.. పేద విద్యార్థులు ప్రతిభ ఆధారంగా కన్వీనర్‌ కోటాలో ప్రముఖ కాలేజీల్లో సీటు సాధించినా, వార్షిక ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారని గుర్తుచేశారు. విద్యార్థులపై భారం పడకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ లాంటి వృత్తివిద్య కోర్సుల్లో ఫీజులను మూడేళ్లకోసారి సమీక్షించాల్సి ఉంటుంది. 2025-28 సంవత్సరాలకు సంబంధించిన ఫీజులపై ఇటీవలే ఫీజు నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందులో హైదరాబాద్‌ పరిసరాల్లోని అనేక కాలేజీల్లో ఫీజును 100 శాతం పెంచారు. ఇది చాలా ఎక్కువ అంటూ విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదనలను తిరస్కరించారు. కళాశాలల్లో మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకొని ఫీజు పెంపు గరిష్ఠంగా 30 శాతం ఉండాలని, అంత కంటే ఎక్కువ ఉండరాదని గత నెలాఖరులో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు.


దీంతో ఫీజుల పెంపుపై ఎఫ్‌ఆర్‌సీ మళ్లీ కసరత్తు ప్రారంభించింది. జూలై మొదటి వారంలో ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్నందున.. అంతకుముందే ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం అధ్యక్షతన జరిగిన విద్యాశాఖ ఉన్నతస్థాయి సమీక్షలో ఫీజుల పెంపు అంశం చర్చకు వచ్చింది. గతంలో పెంచిన ఫీజు ప్రతిపాదనలు, మళ్లీ జరుగుతున్న కసరత్తును అధికారులు సీఎం రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని అనేక కాలేజీల్లో ఇంజనీరింగ్‌ ఫీజులు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు.


ప్రతిభ ఆధారంగా నగరంలోని ప్రముఖ కాలేజీల్లో సీట్లు దక్కినా.. పేద విద్యార్థులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొందని సీఎం అన్నట్లు తెలిసింది. అనేక కాలేజీలు విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా బోధనా సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ‘ఇంజనీరింగ్‌ కాలేజీలపై గత ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ నివేదికలు ఏమయ్యాయి? అందులో ఏం తేలింది? ఆ నివేదికలు సమర్పించండి’ అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆలస్యమైనా పర్వాలేదు, మళ్లీ అధ్యయనం చేయాలని.. విద్యార్థులపై భారం పడకూడదని స్పష్టం చేసినట్లు తెలిసింది.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!

గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 03:03 AM